ట్యాంక్​బండ్, నెక్లెస్​ రోడ్​ను కలుపుతూ స్కైవే..రోప్​వే

ట్యాంక్​బండ్, నెక్లెస్​ రోడ్​ను కలుపుతూ స్కైవే..రోప్​వే
  • హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ మాస్టర్​ప్లాన్ సన్నాహాలు
  • మెగా మాస్టర్​ప్లాన్​తో సంబంధం లేకుండా స్పెషల్ ప్లాన్​
  • ట్యాంక్​బండ్​ పరిసరాలన్నీ ఇందులోకే..
  • ఎమ్యూజ్​మెంట్​ పార్కులు, భారీగా ఫుడ్​ కోర్టులు 
  • టూరిస్టులను ఆకట్టుకునేలా కొత్త ఆకర్షణల ఏర్పాటు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్​బండ్​పరిసర ప్రాంతాలు టూరిస్టులను మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్​పేరుతో గత ప్రభుత్వాలు ఎన్టీఆర్​గార్డెన్​, లుంబినీపార్క్, నెక్లెస్​రోడ్, పీపుల్స్​ప్లాజా ఏర్పాటు చేయగా, తాజాగా ట్యాంక్​బండ్​పరిసరాలను ప్లాన్​ప్రకారం అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. టీడీపీ, బీఆర్ఎస్​హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టును విస్తరించేందుకు బుద్ధపూర్ణిమ మాస్టర్​ప్లాన్​రూపొందించాలని నిర్ణయించినా అప్పటికే నగరంలో ఐదు మాస్టర్​ప్లాన్లు కొనసాగుతుండడంతో కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్​వచ్చిన తర్వాత బుద్ధ పూర్ణిమ మాస్టర్ ప్లాన్​పై అధికారులు దృష్టి సారించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన గ్రీన్​ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

బుద్ధపూర్ణిమ మాస్టర్​ప్లాన్​

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో బల్దియా, హుడా, హడా,సైబరాబాద్, ఎక్సటెండెడ్​ ఏరియా మాస్టర్​ప్లాన్లు ఉన్నాయి. వీటన్నంటిని ఏకం చేసి యూనిఫైడ్​, మెగా మాస్టర్ ప్లాన్ 2050ని త్వరలోనే హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించనున్నారు. ఈ మాస్టర్​ప్లాన్​తో  సంబంధం లేకుండా బుద్ధ పూర్ణిమ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మాస్టర్​ప్లాన్​లో భాగంగా ఎమ్యూజ్​మెంట్​పార్కులు, వినోద కేంద్రాలు, భారీ సంఖ్యలో ఫుడ్​కోర్టులతో పాటు పార్కుల అభివృద్ధి చేసి స్కైవేలు నిర్మించనున్నారు. నెక్లెస్​రోడ్, పీపుల్స్​ప్లాజా వంటి చోట్ల టూరిస్టులను ఆకట్టుకునేలా మరికొన్ని నిర్మాణాలు, అంబేద్కర్​విగ్రహం, అమర వీరుల స్ర్మృతి చిహ్నం దగ్గర సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. 

ట్యాంక్​బండ్​నుంచి నెక్లెస్​ రోడ్​ను కలుపుతూ స్కైవే, రోప్​వేలతోపాటు బోటు షికార్లు వంటి అనేక వినోద కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టూరిజం డెవలప్​మెంట్​కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న నేపధ్యంలో తాజాగా బుద్ధపూర్ణిమ మాస్టర్​ప్లాన్​పై కూడా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.