బిల్డింగ్స్ కట్టే చోట నోటీసు బోర్డులు పెట్టాల్సిందే : హెచ్ఎండీఏ

బిల్డింగ్స్ కట్టే చోట నోటీసు బోర్డులు పెట్టాల్సిందే : హెచ్ఎండీఏ
  • పర్మిషన్ల విషయంలో హెచ్ఎండీఏ కొత్త రూల్​
  • లాండ్ ఏరియా, సర్వే నంబర్, ఫ్లోర్లు, ఇతర డిటెయిల్స్​రాయాలని ఆదేశం
  • ఇక కొనేవారికి సమాచారం.. అధికారుల తనిఖీలకు ఈజీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: అపార్ట్​మెంట్లు, హైరైజ్​బిల్డింగులు కట్టేవారు ఇక నుంచి సదరు నిర్మాణాల వివరాలను తెలియజేసేలా నోటీసు బోర్డులు పెట్టాలని హెచ్ఎండీఏ కొత్త రూల్​పెట్టింది. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పర్మిషన్​ఇచ్చే సమయంలో ఈ కొత్త నిబంధన విధిస్తోంది. హైడ్రా ఎంట్రీతో అనుమతుల జారీ విషయంలో హెచ్ఎండీఏ ఆచితూచి వ్యవహరిస్తోంది.

గతంలో ఎన్ఓసీని రెవెన్యూ, ఇరిగేషన్​శాఖల నుంచి తీసుకురావాలని చెప్పగా, తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ ఆఫీసర్లు కలిసి ఫీల్డ్​విజిట్​చేసిన తర్వాతే అనుమతులు ఇస్తామని ప్రకటించింది. తాజాగా వాటితోపాటు కొత్తగా ప్రతి నిర్మాణదారుడు తాము నిర్మించే బిల్డింగుల ఎదుట నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  

ఏమేమి ఉండాలంటే...

హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మాణదారుల నుంచి నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీ పత్రం తీసుకుంటుంది. దీని ప్రకారం ప్రతి నిర్మాణదారుడు నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసే బోర్డులో స్థలం వివరాలు, సర్వే నంబర్, ఎన్నిఫ్లోర్లు కడుతున్నారు? అనుమతులకు సంబంధించిన నంబర్, స్థలం ఎఫ్​టీఎల్ కానీ బఫర్​జోన్​లో కానీ లేదని తెలియజేయాలి. దీని వల్ల అందులో అక్కడ విల్లా లేదా ఫ్లాట్​కొనాలనుకునేవారు, కమర్షియల్​అయితే స్పేస్​ కొనేవారికి పూర్తి సమాచారం దొరుకుతుంది. కొన్న తర్వాత అనుమతులు లేవనో, చెరువు ప్రాంతంలో ఉందనో హైడ్రా వచ్చి కూల్చివేసే పరిస్థితులు ఉంటాయి. హెచ్ఎండీఏ కొత్త రూల్​తో ఇక నుంచి ఆ భయం ఉండదు.