రేవంత్​కు నోటీసులు..48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి

రేవంత్​కు నోటీసులు..48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి
  • ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న హెచ్​ఎండీఏ 
  • 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
  • కోర్టుకు వెళ్తానన్న రేవంత్  లక్ష కోట్ల ఆస్తిని 7వేల కోట్లకే అమ్మేశారని ఆరోపణ 

హైదరాబాద్,వెలుగు: పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి హెచ్ఎండీఏ శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఓఆర్ఆర్ టెండర్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయింది. అసత్య ఆరోపణలతో ప్రజల్లో హెచ్ఎండీఏ పరువు తీస్తున్నారని, సంస్థ అధికారుల స్థైర్యం దెబ్బతీస్తున్నారని మండిపడింది. నిబంధనల ప్రకారమే టెండర్లు ఇచ్చామని తెలిపింది. రేవంత్తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేసింది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 ఓఆర్ఆర్ టెండర్లలో కల్వకుంట్ల కుటుంబం దోపి డీకి పాల్పడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ధన దాహానికి ఓఆర్ఆర్​ను బలి చేశారని కామెంట్ చేశారు. శుక్రవారం గాంధీభవన్​లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ లిక్కర్ పాలసీలో మొదట కఠిన నిబంధనలు పెట్టారు. కవిత వెళ్లి లాబీయింగ్​ చేసి సౌత్ ​గ్రూప్​కు అనుకూలంగా పాలసీలో నిబంధనలు మార్చారు” అని ఆయన చెప్పారు. ‘‘ఓఆర్ఆర్ టెండర్ల స్కామ్.. లిక్కర్ స్కామ్ కంటే వెయ్యి రెట్లు పెద్దది. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్​ను రూ.7,300 కోట్లకే తెగనమ్మేశారు. ఈ దోపిడీలో కేసీఆర్, కేటీఆర్ లబ్ధిదారులైతే అధికారులు సోమేశ్​కుమార్, అర్వింద్ కుమార్ సూత్రధారులు, పాత్రధారులు” అని ఆరో పించారు.

నెల రోజుల గడువు ముగిసింది.. 

‘‘నాకున్న సమాచారం మేరకు టెండర్ దక్కించుకున్న సంస్థ.. టెండర్ మొత్తం విలువలో 10 శాతం 30 రోజుల్లోగా, మిగతా మొత్తం 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పాను” అని రేవంత్ గుర్తు చేశారు. కానీ, కన్సెషన్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారమైతే 25%  మొత్తాన్ని 30 రోజుల్లోగా కట్టాలని, మిగతా 75% 120 రోజుల్లోపు చెల్లించాలని చెప్పారు. ఇది నిజమా? కాదా? సోమేశ్​కుమార్, అర్వింద్ కుమార్ చెప్పాలన్నారు. ‘‘ఓఆర్ఆర్​టెండర్​కు సంబంధించి ఏప్రిల్​27న అగ్రిమెంట్​జరిగింది. 30 రోజుల్లో 25%  అమౌంట్ కట్టాలన్న నిబంధన మేరకు శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. అంటే మొత్తం టెండర్ అమౌంట్​లో రూ.1,800 కోట్లు ప్రభుత్వానికి ఐఆర్బీ సం స్థ చెల్లించాల్సి ఉంది. ఇప్పటి దాకా ఆ సంస్థ డబ్బు లు కట్టిందో? లేదో? తెలియదు. ఒకవేళ చెల్లించకుంటే రూల్స్​ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు అప్పగించిన టెండర్​ రద్దు చేయాలి” అని డిమాండ్ చేశారు.  

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. 

బీఆర్ఎస్​, బీజేపీ ఒక్క తాను ముక్కలేనని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి మూడో స్థానమేనని ఆ పార్టీ జాతీయ నాయకుడే చెప్పారన్నారు. 40 నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులే లేరని తెలిపారు. ‘‘కాంగ్రెస్ నేతలు కొందరు ఆవేశంతో బీజేపీలో చేరారు. బీజేపీ అసలు రంగు బయటపడడంతో నిజం తెలుసుకున్నారు. బీజేపీలో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ నేతలంతా మాతో కలిసి రావాలి” అని పిలుపునిచ్చారు. 

ఏ హామీలు అమలు చేశారు?

ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మ కం కలిగించారని బీఆర్ఎస్ పాలనను మంత్రి హరీశ్​రావు సమర్థించుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. ‘‘దళితులకు మూడెకరాలు ఇవ్వనందుకు.. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీని అడ్డుకోలేనందుకు.. ఉద్యోగాలు భర్తీ చేయనందుకు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయనందుకు.. మీ పాలనను సమర్థించుకుంటారా?” అని ప్రశ్నించారు. ‘‘నేను స్వాతిముత్యం, మా మామ ఆణిముత్యం అని హరీశ్ రావు అనుకుంటే సరిపోదు. హరీశ్ పొడుగుంటే సరిపోదు. మెదడు కూడా ఉండాలి” అని విమర్శించారు. 

 

రేవంత్​కు హెచ్ఎండీఏ నోటీసులు


న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపింది. కాగా, హెచ్ఎండీఏ నోటీసులపై రేవంత్ ఘాటుగా స్పందించారు. దీనిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ ద్వారా కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. ఇది తనకే మంచి అవకాశమని, టెండర్​ను రద్దు చేసేందుకు ఇదొక చాన్స్ అని పేర్కొన్నారు. 

అలాంటి నిబంధనలేం లేవ్.. 

టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ 10%  అమౌం ట్ కట్టాల్సి ఉందని రేవంత్ పేర్కొనగా.. టెండర్ అగ్రిమెంట్​లో అలాంటి నిబంధన లేదని లీగల్ నోటీసుల్లో హెచ్ఎండీఏ స్పష్టం చేసింది. 120 రోజుల్లో మొత్తం అమౌంట్ కట్టాలని ఉందని తెలి పింది. రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించింది. 

అవసరాలకు తగ్గట్టే అధికారుల బదిలీ.. 

స్వప్రయోజనాల కోసమే రిటైర్డ్ అధికారి బీఎల్ఎన్​రెడ్డిని హెచ్​జీసీఎల్ ​ఎండీగా నియమించారంటూ రేవంత్ అర్థం లేని ఆరోపణలు చేశారని హెచ్​ఎండీఏ నోటీసుల్లో పేర్కొంది. కార్యకలాపాల్లో భాగంగా అవసరాలకు తగినట్టు అధికారులను ట్రాన్స్​ఫర్ ​చేస్తుంటామని వెల్లడించింది. ‘‘ఐఆర్బీ దేశంలోనే పేరున్న సంస్థ. కానీ దానిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అదొక షెల్ ​కంపెనీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడితోనే లక్ష కోట్ల ఆస్తిని ఐఆర్బీకి అమ్ముకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు. టోల్ ఆపరేట్ ట్రాన్స్​ఫర్ పద్ధతిలోనే టెండర్ ఇచ్చాం. కేవలం ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసమే ఓఆర్ఆర్​ను లీజుకు ఇచ్చాం. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఐఆర్బీ సంస్థకు టెండర్  ఇచ్చాం” అని హెచ్​ఎండీఏ నోటీసుల్లో తెలిపింది.