ఫ్యూచర్ సిటీలో మహా టౌన్​షిప్ లు

ఫ్యూచర్ సిటీలో మహా టౌన్​షిప్ లు
  • రేడియల్​ రోడ్లకు రెండువైపులా నిర్మాణం
  • రైతుల నుంచి భూసేకరణకు నిర్ణయం  
  • ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​ను కలిపేలా గ్రీన్​ ఫీల్డ్ రేడియల్​​ రోడ్లు  
  • ప్రణాళికలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ  

హైదరాబాద్​సిటీ, వెలుగు:నగరం శరవేగంగా గ్రేటర్​ పరిధి దాటి ఓఆర్ఆర్​వరకూ విస్తరిస్తోంది. తాజాగా హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్​ఆర్​వరకూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న సిటీ అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య సకల సౌకర్యాలతో భారీ టౌన్​షిప్​ల నిర్మాణానికి ప్లాన్​వేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ట్రాన్స్​పోర్టేషన్, కరెంట్, డ్రింకింగ్​వాటర్, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతున్నది. 

రైతుల నుంచి భూసేకరణ..

ముందుగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్​సిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండీఏ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రైతుల నుంచి భారీ ఎత్తున భూ సేకరణ చేయాలని నిర్ణయించింది. భూసేకరణ తర్వాత వాటిలో లేఔట్లు వేసి 60 శాతం ప్లాట్లను తిరిగి రైతులకు ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన 40శాతం ఏరియాలో టౌన్​షిప్​లు కట్టి భారీగా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా కొన్ని ప్లాట్లు చేసి విక్రయించాలని ప్లాన్​చేస్తోంది. 

ఇప్పటి వరకూ ఉప్పల్​భగాయత్​, కోకాపేట, బుద్వేల్​, మోకిల, బాచుపల్లి, హయత్​నగర్​లో హెచ్ఎండీఏ వేసిన లేఔట్లకు మంచి డిమాండ్​వచ్చి హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయి. కొన్ని టౌన్​షిప్​లకు కూడా మంచి గిరాకీ వచ్చింది. అందుకే, కొత్త ప్లాన్​లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య ఫ్యూచర్​సిటీని అభివృద్ధి చేసేందుకు గ్రీన్​ఫీల్డ్​ రేడియల్​ రోడ్లను నిర్మించనున్నది. వీటి నిర్మాణానికి టెండర్లను కూడా పిలిచింది. 

ఓఆర్ఆర్​ ఎగ్జిట్​ పాయింట్ల నుంచి..  

ఓఆర్ఆర్​నుంచి ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ నిర్మించాలనుకుంటున్న గ్రీన్​ ఫీల్డ్ రేడియల్​​రోడ్లను 41.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొదటిదశలో రూ.1665 కోట్లతో 19.20 కి.మీ., రెండో దశలో 2,365 కోట్లతో 22.30 కి.మీ నిర్మించనున్నారు. ఓఆర్​ఆర్​13 నంబర్​ఎగ్జిట్​ పాయింట్ రావిర్యాల  నుంచి ఫ్యూచర్​సిటీ మీదుగా కొంగర కుర్ధు, కొంగర కలాన్​, మీర్​ఖాన్​పేట. ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్​, ముద్విన్​, ఆమన్​గల్​ మీదుగా ఆకుతోటపల్లి వరకూ ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ నిర్మించనున్నారు. 

ఈ ప్రాంతాల్లోనే రేడియల్ రోడ్లను ఆనుకుని టౌన్​షిప్​లు నిర్మించాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​తర్వాత ఆ స్థాయిలో నాలుగో నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్​ద్వారా భూములు సేకరించనున్నారు. ఈ భూముల్లో ఎడ్యుకేషనల్​ఇన్​స్టిట్యూషన్స్​, రోడ్లు, పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​, పార్కులు, కమర్షియల్​కాంప్లెక్సుల నిర్మాణాలకు 353 ఎకరాలు కేటాయించనున్నారు. రెండో దశలో 171 ఎకరాల్లో ఇండ్ల కోసం భూములను కేటాయించనున్నారు.