భూమార్పిడికి హెచ్ఎండీఏ రెడీ…సీఎల్​యూ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు 

భూమార్పిడికి హెచ్ఎండీఏ రెడీ…సీఎల్​యూ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు 
  • గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు   
  • అవినీతి జరిగిందన్న ఆరోపణలతో   ఆపేసిన కాంగ్రెస్​ సర్కారు 
  • త్వరలోనే పర్మిషన్లుఇచ్చే అవకాశం 
  • వివాదాలు లేనివాటికే ముందు ప్రాధాన్యత

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో భూ మార్పిడి కోసం (ఛేంజ్​ఆఫ్​ల్యాండ్​యూజ్) కోసం వస్తున్న దరఖాస్తులపై అధికారులు దృష్టిపెట్టారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న హెచ్ఎండీఏ యూఎల్​సీ అనుమతులు ఇవ్వడానికి నిర్ణయించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు భూమార్పిడి అనుమతులు ఇచ్చారని, హెచ్​ఎండీఏలో కొందరు అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో కాంగ్రెస్​సర్కారు అధికారంలోకి రాగానే అనుమతులను నిలిపివేసింది. వివరాలు ఇవ్వాలని హెచ్ఎండీఏను ఆదేశించి ఒక రిపోర్ట్​ తీసుకుంది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టుల కోసం హెచ్ఎండీఏకు నిధుల అవసరం రావడం, ఆదాయం పెంచుకునే ప్లాన్లలో భాగంగా మళ్లీ యూఎల్​సీ అనుమతులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే వివిధ జోన్ల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో వీలైనంత తొందరలో పర్మిషన్​ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

వివాదాలు లేని వాటికే అనుమతి...

అగ్రికల్చర్​నుంచి రెసిడెన్షియల్ కు, రెసిడెన్షియల్​నుంచి కమర్షియల్​కు, నాన్​అగ్రికల్చర్​ల్యాండ్​రెసిడెన్షియల్​కు, కమర్షియల్​గా మార్చాలని హెచ్ఎండీఏకు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. కొంత కాలంగా హెచ్ఎండీఏ పరిధిలో రియల్​ఎస్టేట్​పుంజుకోవడంతో కొత్త వెంచర్లు, లేవుట్ల కోసం వందల సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారని అంటున్నారు.

గతంలో నిలిపివేసినవే కాకుండా తాజాగా వస్తున్న దరఖాస్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వీటికి అనుమతులు ఇవ్వడం ద్వారా కోట్లలో ఆదాయం సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ ప్లాన్​వేసింది. అయితే, వివాదాలు లేని దరఖాస్తులకే ముందుగా అనుమతి ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నట్టు సమాచారం.  

ఆ 84 గ్రామాల నుంచే ఎక్కువ  

మాస్టర్‌‌ప్లాన్‌‌లో భాగంగా ఒక జోన్ నుంచి మరో జోన్‌‌లోకి మార్పు చేయాలంటే సీఎల్‌‌యూ తప్పనిసరి. ఇందుకోసం హెచ్‌‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక కమిటీ పరిశీలించి అనుమతులు ఇస్తుంది. గతంలో 111 జీవో ప్రాంతంలోని 84 గ్రామాల కోసం హెచ్‌‌ఎండీఏ ఓ మాస్టర్‌‌ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. ఇది కార్యరూపం దాల్చలేదు.

దీంతో ఆ గ్రామాలను ఏ జోన్‌‌లోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఈ 84 గ్రామాల్లోని భూములన్నీ ఆంక్షల మధ్య బయో కన్జర్వేషన్ జోన్‌‌లో ఉన్నాయి. గత బీఆర్ఎస్​సర్కారు బయో కన్జర్వేషన్ జోన్‌‌ను తొలగించి, నాలా కన్వర్షన్‌‌కు అవకాశం కల్పిస్తామని ప్రకటించడంతో111 జీవో ఏరియాలోని భూ యజమానులు హెచ్‌‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికి కూడా చేస్కుంటూనే ఉండడంతో వీరి దరఖాస్తుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది