
- ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏకు భలే చాన్స్
- పెండింగ్లో మూడున్నర లక్షల అప్లికేషన్లు
- ఇప్పటికే లక్ష పాట్ల పరిశీలన పూర్తి
- చెల్లింపులపై మార్చి 31వరకు 25 శాతం డిస్కౌంట్
- అప్లై చేసుకున్నవారు డబ్బులు కట్టాలంటూ ప్రకటన
- పది రోజుల్లోనే అప్లికేషన్ల ప్రాసెస్
హైదరాబాద్సిటీ, వెలుగు:హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాలా కాలంగా సుమారు మూడున్నర లక్షల ప్లాట్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా.. గత బీఆర్ఎస్ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇవ్వకపోవడంతో అధికారులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారం కింద ఎల్ఆర్ఎస్పై ప్రకటన చేసింది.
దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31వ తేదీలోపు డబ్బులు కడితే ఎల్ఆర్ఎస్ఫీజులో 25 శాతం డిస్కౌంట్ఇస్తామని ప్రకటించింది. దీంతో అధికారులు పెండింగ్దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్ష వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. ముందు వీటికి అనుమతులు ఇచ్చి త్వరలోనే మిగతా వాటి పరిశీలన చేస్తామంటున్నారు. మొదటి విడతలో అర్హులైన వారిని డబ్బులు కట్టాలంటూ మెసేజ్లు కూడా పంపిస్తున్నారు.
1,337 లే అవుట్ల రెగ్యుల రైజ్ కోసం..
ఎల్ఆర్ఎస్ స్కీంలో భాగంగా అక్రమ లే అవుట్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని భావించిన గత ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 1,337 అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరించాలంటూ లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం లేఅవుట్లలో 3.20 లక్షల ప్లాట్లు ఉన్నాయి. శంకర్పల్లి జోన్-1లో 52,048, జోన్-2 పరిధిలో 52, 046 శంషాబాద్పరిధిలో 87,040, ఘట్కేసర్లో 1,18,542 , మేడ్చల్–1లో 2,073, మేడ్చల్-–2లో 9,678 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసిన అధికారులు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దరఖాస్తుదారులంతా రూ.వెయ్యి ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఆ డబ్బులే రూ.32 కోట్లు వచ్చాయి. 25 శాతం రాయితీతో వీటిని రెగ్యులరైజ్చేయడం ద్వారా మరో రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది.
స్టేటస్చెక్చేసుకోండిలా..
దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ వెబ్సైట్లో తమ దరఖాస్తు స్టేటస్తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. లేకపోతే హెచ్ఎండీఏ కాల్సెంటర్18005998838కు ఫోన్ చేయవచ్చన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే పది రోజుల్లోనే దరఖాస్తులను ప్రాసెస్చేస్తామని తెలిపారు.
ఈ నిబంధనలు పాటిస్తేనే..
ప్రభుత్వం ప్రకటించిన గైడ్లైన్స్ప్రకారమే లే అవుట్లను క్రమబద్ధీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని ఉండి, దరఖాస్తు చేసుకున్నవారే అర్హులంటున్నారు. అలాగే ప్రతి అనధికార లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు విక్రయించి ఉంటేనే మిగిలిన ప్లాట్లను రెగ్యులరైజ్చేస్తామంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్, ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట చట్టం ప్రకారం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్స్రెగ్యులరైజ్చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.
అలాంటి వాటికి గతంలో రిజిస్ట్రేషన్ చేసినా ఇప్పుడు తాము అనుమతించేది లేదంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్లాట్చెరువులకు 200 మీటర్ల దూరంలో ఉండాలని, దీనికి రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్ల ఆమోదం ఉండాలన్నారు. ఈ నిబంధనలు అన్ని పక్కాగా ఫాలో అయిన వారు మార్చి 31వ తేదీ లోపు 25 శాతం డిస్కౌంట్తో ఫీజు చెల్లించాలని, ఒకవేళ ఎల్ఆర్ఎస్దరఖాస్తు రిజెక్ట్అయితే 90 శాతం ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు.