ఎకో పార్కులో అడ్వెంచర్స్ జోన్

ఎకో పార్కులో  అడ్వెంచర్స్ జోన్
  • కొత్వాల్​గూడ పార్కులో ఆరు ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
  • పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి నిర్ణయం 
  • టెండర్లను ఆహ్వానించిన హెచ్ఎండీఏ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్​మండలం కొత్వాల్​గూడలో150 ఎకరాల్లో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎకోపార్కులో యూత్​ను ఆకట్టుకోవడానికి ‘అడ్వెంచర్స్​జోన్’​ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం పార్కులో 6 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రైవేట్, పబ్లిక్​పార్ట్​నర్​షిప్​పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించిన అధికారులు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ గ్లోబల్​టెండర్లు పిలిచారు. ఎంపికైన కంపెనీకి పనులు అప్పగించనున్నారు. ఇప్పటికే ఎకో పార్కు పనులు 90 శాతం పూర్తికాగా, త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్​కు ఉదయం వెళ్తే సాయంత్రం వరకూ ఎంజాయ్​చేసేలా పలు ప్రత్యేకతలతో పక్కాగా తీర్చిదిద్దుతున్నారు. 

ఆకట్టుకునే రీతిలో .. 

సాహసాలు చేసేందుకు ఇష్టపడే యువత, పిల్లలకు అడ్వెంచర్​జోన్​లోని వివిధ రకాల గేమ్స్​ఆకట్టుకుంటాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్కులోని అందాలను పైనుంచి వీక్షించేందుకు స్కై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఆరు మీటర్ల వెడల్పు, 30 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం జరగనుంది. యూత్​ఎక్కువ ఆసక్తి చూపించే రోలర్​ కోస్టర్​జిప్​లైన్​ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని 300 మీటర్లకు తక్కువ కాకుండా నిర్మించే అవకాశం ఉంది. పర్వతాలు ఎక్కాలని ఆసక్తి చూపే వారి కోసం, పిల్లల కోసం క్లైంబింగ్​వాల్​ను కట్టనున్నారు. 

60 అడుగుల ఎత్తులో జెయింట్​స్వింగ్​ఏర్పాటు చేయనున్నారు. 6 మీటర్ల వెడల్పు, 150 మీటర్ల ఎత్తులో సస్పెన్షన్​ బ్రిడ్డి కూడా నిర్మించనున్నారు. 100 మీటర్ల ఎత్తులో ఎగిరే ఫ్లయింగ్​కప్​, 60 అడుగుల ఎత్తులో హ్యూమన్ స్లింగ్​షాట్​,250 మీటర్ల జిప్​లైన్​, 360 డిగ్రీ ఫ్లైయింగ్​సైకిల్, రోప్​ కోర్స్​, ఎత్తుపై నుంచి దూకే సాహసం చేసే వారికి బంగీ జంప్​ కోసం బంగీ ట్రాంపోలైన్​, వర్టెక్స్​ టన్నెల్స్​, రైఫిల్​ షూటింగ్​వంటివి అడ్వెంచర్​ జోన్​లో ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు రక రకాల స్పోర్ట్స్​యాక్టివిటీస్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.