
- మొబైల్ యాప్తో నీటి వాల్వ్ల నిర్వహణ
- అందుబాటులోకి ‘స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ’
- ఆస్కి సహకారంతో సనత్ నగర్లో ప్రయోగాత్మకంగా అమలు
- ఇక్కడ సక్సెస్అయితే నగరమంతా అమలు..
- ప్రమాదాల నివారణతో పాటు అక్రమాలకూ చెక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు వాటర్బోర్డు అధికారులు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో టైంకు నీటిని విడుదల చేసేందుకు వాల్వ్లను తిప్పుతుంటారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాల్వ్లన్నీ దాదాపు రోడ్లపైనే ఉన్నాయి. ఈ వాల్వ్లను తిప్పే సమయంలో అప్పుడప్పుడూ లైన్మెన్లు ప్రమాదాలకు గురవుతున్నారు.
రాత్రి వేళల్లో రోడ్లపై వెళ్లే వాహనాలు ఢీకొట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో గుంతలు కనిపించక ప్రమాదాల పాలైన వారూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా లైన్మెన్ల పనుల్లో టెక్నాలజీని ఉపయోగించాలని వాటర్బోర్డు నిర్ణయించింది. స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీతో వాల్వ్లను ఆటోమేటిక్గా నియంత్రించే ఆలోచన చేసింది. ప్రయోగాత్మకంగా నగరంలోని సనత్ నగర్లో ఈ పద్ధతిలో వాల్వ్లు తిప్పుతున్నారు.
ఆస్కి సహకారంతో..
స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీతో (ఆటోమేటిక్ వాల్వ్ ఆపరేషన్ పద్ధతి) ప్రయోగాత్మకంగా కొన్ని రోజులుగా సనత్ నగర్లో వాల్వ్ల నిర్వహణ చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) సహకారంతో ఈ స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. టెక్నికల్సపోర్ట్అందజేస్తున్న కంపెనీతో ఆస్కి ఎంవోయూ చేసుకుని వాటర్బోర్డుకు ఈ టెక్నాలజీని అందిస్తోంది. దీనివల్ల లైన్ మెన్లు ఫీల్డ్లెవెల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం మొబైల్ యాప్ తో స్మార్ట్వాల్వ్లను ఆపరేట్ చేయొచ్చు.
అంతేగాకుండా వాటర్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లోరిన్ పర్సంటేజ్కూడా తెలుసుకోవచ్చు. దీన్ని సోలార్ ఎనర్జీతో రన్చేయవచ్చని అధికారులు తెలిపారు. బ్యాటరీ బ్యాకప్ సైతం ఉండడంతో పవర్ సమస్యలు కూడా ఉండవని చెప్తున్నారు. సనత్నగర్లో ఇప్పటివరకు సమర్థంగానే పని చేస్తుండడంతో ఈ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకునేందుకు అధికారులు ఆస్కితో సంప్రదింపులు జరుపుతున్నారు. వారు ఓకే చెప్తే త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీని అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.
అక్రమాల నివారణకు కూడా..
ఒక ప్రాంతంలో ఎక్కువ టైం నీళ్లు రావాలన్నా, ఎక్కువ ప్రెషర్ తో నీళ్లు రావాలన్నా లైన్మెన్లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ప్రెషర్తో, ఎక్కువ సేపు నీళ్లు రావాలని కోరుకుంటారు. దీంతో దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు లైన్మెన్లు ముడుపులు తీసుకుని నీటి సరఫరా ఎక్కువ సేపు రావడానికి, ఎక్కువ ప్రెషర్ వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిల్లో అమల్లోకి వస్తే వాల్వ్ల నిర్వహణ, నీటి సరఫరా తీరును హెడ్డాఫీసు నుంచి మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు లైన్మెన్ల అక్రమాలకు చెక్పెట్టవచ్చని అధికారులు అంటున్నారు.