బైక్ దొంగగా మాజీ హోంగార్డు

బైక్ దొంగగా మాజీ హోంగార్డు

 

  • హాస్పిటళ్లు, వైన్​షాపులే టార్గెట్
  •   ఇద్దరి అరెస్టు, 8 బైక్​లు సీజ్​

పద్మారావునగర్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఉద్యోగం కోల్పోయిన ఓ హోంగార్డు దొంగగా మారాడు. హాస్పిటళ్లు, వైన్​షాపులు టార్గెట్ చేసి బైకులు కొట్టేశాడు. కేసు వివరాలను చిలకలగూడ ఠాణాలో ఈస్ట్ జోన్​అడిషనల్​ డీసీపీ నర్సయ్య శుక్రవారం వెల్లడించారు. బోయిగూడకు చెందిన అబ్రహం జానీ (48) 1996లో పోలీస్​శాఖలో హోంగార్డుగా చేరాడు. యాంటీ హైజాకింగ్, డీజీపీ ఆఫీసులో డ్రైవర్​గా పనిచేశాడు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారన్న ఆరోపణలపై 2015లో ప్రభుత్వం పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో అబ్రహం జానీ ఒకరు. 

జాబ్​పోయిన తర్వాత మారుతీ షోరూమ్​ సర్వీస్​స్టేషన్ లో పనిచేసి మానేశాడు. ఈ క్రమంలో మద్యం, గంజాయికి బానిసై ఈజీమనీ కోసం బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఏడాదిలో గాంధీ హాస్పిటల్​లో నాలుగు, పాత గాంధీ, హెబ్రోన్​చర్చి, ఎస్ఎన్ఎస్ఎల్​వైన్స్, దుర్గా వైన్స్​వద్ద ఒక్కొక్కటి చొప్పన బైకులు దొంగలించాడు. వరుస దొంగతనాల కేసును పోలీసులు చాలెంజ్​గా తీసుకొని ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద బైక్​లు కొన్న పార్శిగుట్ట శ్రీనివాస్​ నగర్​కు చెందిన రావుల ఆంజనేయులను అదుపులోకి తీసుకొని, దొంగిలించిన 8 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.