- రాజ్యసభలో సిటిజన్షిప్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి
- ఈ బిల్లుతో ఇండియన్ ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండబోదని ప్రకటన
1955 నాటి సిటిజన్షిప్ చట్ట సవరణకు ప్రతిపాదించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. మొదటగా అమిత్ షానే చర్చ షురూ చేశారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
సిటిజన్షిప్ బిల్లుతో భారత్లోని ముస్లింలకు ఎటువంటి నష్టం కలగబోదని చెప్పారు అమిత్ షా. కొన్ని పార్టీలు కావాలని పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, వాటి నమ్మొద్దని సూచించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఆ నాయకులు ఈ బిల్లుతో అసలు ఇండియన్ ముస్లింలకు లింక్ ఏంటో చెప్పాలన్నారు. మన దేశంలోని ముస్లింలను కొన్ని విపక్షాలు భయపెట్టాలని చూస్తున్నాయని, ఆ పార్టీల మాటలను నమ్మొద్దని, ఎవరూ భయపడొద్దని కోరారు అమిత్ షా. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగబద్ధంగా పని చేస్తోందని, మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారాయన. భారత పౌరులపై ఎటువంటి వివక్ష ఉండబోదని స్పష్టం చేశారు.
శరణార్థుల కోసమే..
సిటిజన్షిప్ బిల్లు శరణార్థుల రక్షణ, వారి హక్కుల కోసమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 20 శాతం మైనారిటీల జనాభా తగ్గిపోయిందని తెలిపారు. హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ మతాలకు చెందిన వారిని ఆ దేశాల్లో చంపేయడమో లేదా అక్కడ హింసను తట్టుకోలేక పారిపోయి భారత్ రావడమో జరిగిందని ఆయన వివరించారు.