
జోగిపేట, వెలుగు: సీఎం కేసీఆర్వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని హోమ్మినిస్టర్ మహమూద్అలి అన్నారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన మైనార్టీల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల పిల్లలు విద్యావంతులు కావాలని తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 204 మైనార్టీ గురుకుల భవనాలు నిర్మించినట్లు చెప్పారు. మైనార్టీల పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళుతున్నారంటే కేసీఆర్ పుణ్యమే అన్నారు.
యాబై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు మైనార్టీల గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్కు పొరపాటున ఓటు వేసినా మోసపోయినట్లే అన్నారు. ఆందోల్ లో ఐదేళ్లకోసారి వచ్చే లీడర్ కావాలా ఎప్పుడూ మీ మధ్యన ఉండే లీడర్ కావాలో తేల్చుకోవాలన్నారు. క్రాంతికిరణ్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడని, ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడని, ప్రజలు ఆయన్నే గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ మైనార్టీల స్థితిగతులు మార్చినట్లు చెప్పారు. కేసీఆర్పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి గొడవలకు తావివ్వలేదన్నారు. తాను గెలిచాక మైనార్టీల కాలనీల్లో సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజూశ్రీ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ భిక్షపతి, జగన్మోన్రెడ్డి, నారాయణ, అర్పత్, లాయక్పాల్గొన్నారు.