
- వరుస ఘటనలతో మేనేజ్మెంట్ నిర్ణయం
- లెక్చరర్స్ తో వీసీ, కలెక్టర్అత్యవసర సమావేశం
- ప్రతి శనివారం ఆర్ యూ ఓకే’ కార్యక్రమం
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కు ఐదు రోజుల పాటు హోమ్ సిక్ హాలీడేస్ ప్రకటించారు. ఇటీవల జాదవ్ బబ్లూ అనే పీయూసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మొదట్లో సీరియస్గా తీసుకోని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. ‘వెలుగు’లో 'బాసర ట్రిపుల్ ఐటీలో ఏం మారలే' అన్న కథనం రావడంతో స్పందించింది. శుక్రవారం ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ వెంకటరమణ, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి క్యాంపస్లో లెక్చరర్స్, పేరెంట్స్ తో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాలీడేస్ ప్రకటించడంతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు
స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా మీటింగ్ లో చర్చించారు. ఒక్కో లెక్చరర్ వంద నుంచి 150 మంది స్టూడెంట్స్కు మెంటర్గా వ్యవహరించాలని వీసీ వెంకటరమణ, కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. కౌన్సిలర్ల సంఖ్య పెంచాలని, గర్ల్ స్టూడెంట్స్ కోసం మహిళా కేర్ టేకర్స్ ను నియమించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం యోగా , 15 రోజులకోసారి మోటివేషన్ క్లాస్, వారానికొకసారి ‘ఆర్యూ ఒకే’ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రతి శనివారం రాత్రి మోటివేషనల్ మూవీ వేయాలని, స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచాలని సూచించారు. స్టూడెంట్స్ సమస్యలు, ప్రోగ్రెస్ పై ప్రతినెలా పేరెంట్స్ తో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించించేందుకు లెక్చరర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని, మెస్లో ఫుడ్ క్వాలిటీని లెక్చరర్లు చెక్ చేయాలని సూచించారు. సైన్స్ బ్లాక్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని వీసీ తెలిపారు.