![నాసిరకం స్పేర్ పార్ట్స్కు .. బ్రాండెడ్ లేబుల్స్](https://static.v6velugu.com/uploads/2023/08/Honda-and--Hero_qYmodTFXfj.jpg)
- ఢిల్లీ నుంచి సిటీకి తీసుకొచ్చి ఆటోమొబైల్ షాపుల్లో సేల్
- అల్వాల్, లోతుకుంట, బాచుపల్లిలో మేడ్చల్ఎస్వోటీ దాడులు
- రూ.40 లక్షలు విలువైన స్పేర్ పార్ట్స్ సీజ్
- ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్,వెలుగు : హోండా, హీరో, బజాజ్ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్స్ను అతికించి.. బైక్లకు సంబంధించి డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్న గ్యాంగ్ను మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అల్వాల్, లోతుకుంట, బాచుపల్లిలోని నాలుగు ఆటో మొబైల్స్ షాపుల్లో దాడులు చేసిన పోలీసులు రూ.40 లక్షల విలువైన డూప్లికేట్ స్పేర్పార్ట్స్ను గుర్తించి సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన గణపత్ కుమావత్(28) సిటీకి వచ్చి మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఉంటున్నాడు. స్థానికంగా డైమండ్ అండ్ భాగ్యలక్ష్మి పేరుతో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు.
ఢిల్లీలో ఉంటున్న మరో రాజస్థానీ నరేశ్తో కలిసి డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ను అమ్మేందుకు ప్లాన్ చేశాడు. ఢిల్లీలో తయారైన నాసిరకం స్పేర్ పార్ట్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చేవాడు. హోండా, హీరో, బజాజ్ కంపెనీలకు చెందిన లోగోస్, హోలోగ్రామ్స్, స్టిక్కర్స్ను డిజిటల్ ప్రింటింగ్ చేసేవాడు. ఒరిజినల్ పార్ట్స్ తరహాలోనే ప్యాకింగ్ చేసేవాడు. తర్వాత వీటిని కింగ్ కోఠి, సికింద్రాబాద్లోని ఆటోమొబైల్ హోల్ సేల్ షాపులకు తరలించేవాడు.
సిద్దిపేట, వరంగల్కు సప్లయ్..
హైదరాబాద్లోని 28 హోల్సేల్ షాపులతో పాటు సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని ఆటోమొబైల్ షాపులకు గణపత్ ఈ స్పేర్ పార్ట్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. బాచుపల్లిలో గణపత్ నిర్వహించే మహాలక్ష్మి, సూరారంలోని మతాజీ, అల్వాల్లో భాగ్యలక్ష్మి, లోతుకుంటలోని డైమండ్ ఆటోమొబైల్ షాప్స్లోనూ వీటిని అమ్ముతున్నాడు.
హోల్సేల్ వ్యాపారులకు అమ్మేవాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసులు గణపత్ కుమావత్కు చెందిన ఆటో మొబైల్ షాపులపై దాడులు చేశారు. అతడితో పాటు పాటు డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్న సురేష్ చంద్, శ్రవణ్ కుమార్, ఓంరామ్ నిమావాత్, రాజు రామ్ను అదుపులోకి తీసుకున్నారు.