వర్షాలకు  ఉద్యాన పంటలకు తెగుళ్లు.. .. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

వర్షాలకు  ఉద్యాన పంటలకు తెగుళ్లు.. .. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

ఎడ తెరిపి లేకుండా  రోజులతరబడి భారీ వర్షాలు కురిశాయి. వానకాలం సీజన్‌లో రైతులు పండించే ఉద్యాన పంటల్లో వర్షపు నీరు నిలిచింది. ఉద్యాన పంటలకు నీటితో పంటలకు ప్రమాదమని, ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మొక్కలు కుళ్లిపోతాయని, వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలు కుళ్లిపోయి.. ఎర్రబారి.. గిడసబారకుండా ఉండాలంటే యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి సస్యరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో  తెలుసుకుందాం.

ALSO READ | అధిక వర్షాలు.. వరి, పత్తి పంటల్లో చీడ పీడలు, తెగుళ్ల నివారణ పద్దతులు ఇవే..

భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు పంట పొలాల్లో వర్షం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో అధిక తేమ వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తెలుసుకుంటూ పంటను రక్షించుకోవాలి.

  •  టమాట పంటలో కాల్షియం ధాతు లోప నివారణకు 5 గ్రా.చొప్పున కాల్షియం నైట్రేట్ ఎరువును లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
  •  బీర వంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్న రైతులు సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. అలాగే వెజిటబుల్ స్పెషల్ ఎరువును 2- 3గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పై పాటుగా పిచికారీ చేయాలి.
  •  అరటిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని అరటి తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి.
  •  చీని, నిమ్మ తోటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. చీని తోటల్లో కొత్తగా చిగుర్లు వచ్చిన తోటలకు సుక్ష్మధాతు లోప నివారణకు ఫార్ములా 4 లేదా సుక్ష్మధాతువుల మిశ్రమాన్ని లీటరు నీటికి 2.5 నుంచి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
  •  ప్రస్తుతం మిరప పంట అక్కడక్కడ శాఖీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తామర పురుగులు, పచ్చ పురుగు ఆశించడానికి అనుకూలం. తమర పురుగుల నివారణకు నీలం, పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 30 నుంచి 40 వరకు పెట్టుకోవాలి. అలాగే 10000 పి.పి.ఎం.వేప నూనెను ఒక మి.లీ లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పచ్చ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వానకాలంలో అధిక వర్షాలకు పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. రైతులు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.పంటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పొలంలో ఎక్కువ నీరు ఉంటే మొక్కలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. వాటిని గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించండి.