నిర్మలకు హోటల్ ఓనర్ క్షమాపణ.. బెదిరించి చెప్పించారన్న కాంగ్రెస్

నిర్మలకు హోటల్ ఓనర్ క్షమాపణ.. బెదిరించి చెప్పించారన్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో ఇటీవల సోషల్​మీడియా వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన తమిళనాడు రెస్టారెంట్ చైన్​ యజమాని శ్రీనివాసన్.. ఫైనాన్స్​మినిస్టర్​ నిర్మలా సీతారామన్‎కు ప్రైవేట్‎గా క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ వీడియోను బీజేపీ శుక్రవారం బయటపెట్టడంతో కాంగ్రెస్​మండిపడింది. రెస్టారెంట్ యజమానిని బీజేపీ బెదిరించిందని, ఇందుకు నిర్మల క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేసింది. 

జీఎస్టీ గురించి నిర్మలను ప్రశ్నిస్తూ తమిళనాడుకు చెందిన శ్రీ అన్నపూర్ణ  రెస్టారెంట్స్ యజమాని శ్రీనివాసన్ ఇటీవల సోషల్​మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వైరల్ అయింది. దీనిపై రెస్టారెంట్​యజమాని తిరిగి నిర్మలకు క్షమాపణ చెప్పడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే స్పందిస్తూ.. అన్నపూర్ణ రెస్టారెంట్స్ ఓనర్​ వ్యవహారంలో నిర్మలా సీతారామన్ తీరు అవమానకరంగా ఉందన్నారు. 

ఇది వ్యాపారులకు అవమానం: రాహుల్ గాంధీ ​

నిర్మలకు హోటల్స్ యజమానితో క్షమాపణలు చెప్పించడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన బిలియనీర్ స్నేహితుల కోసం ప్రధాని రూల్స్​మారుస్తారని విమర్శించారు. చిన్న వ్యాపారులను మాత్రం నోట్ల రద్దు, పన్నులు, జీఎస్టీల పేరుతో ఇబ్బంది పెడతారని విమర్శించారు. క్షమాపణల పేరుతో వారిని అవమానిస్తున్నారని ఫైరయ్యారు. కాగా, ఈ క్షమాపణ వీడియోపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో తమిళనాడు బీజేపీ చీఫ్​అన్నామలై క్షమాపణలు చెప్పారు.