-
వర్కర్తో పాటు మరో వ్యక్తి అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: యజమాని కండ్లు గప్పి డబ్బుల బ్యాగుతో ఉడాయించిన వర్కర్తో పాటు మరో వ్యక్తిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన రోహన్ కదమ్(20), ముజమ్మిల్ బాలిగర్(21), పృథ్వీరాజ్, ప్రసాద్ ఫ్రెండ్స్ . వీరంతా వారం కింద సికింద్రాబాద్లోని ఓ హాస్టల్లో దిగి చోరీలకు స్కెచ్ వేశారు. ప్లాన్లో భాగంగా సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో జితేంద్ర కుమార్కు చెందిన బంగారం శుద్ధి దుకాణంలో రోహన్ పనికి కుదిరాడు. గురువారం సాయంత్రం తన షాపులో శుద్ధి చేసిన 400 గ్రాముల బంగారంతో పాటు రోహన్ను తీసుకొని మోండా మార్కెట్లో ఉన్న ఎస్ఎం జువెలరీకి జితేంద్ర వెళ్లాడు
. షాపు యజమానికి గోల్డ్ఇచ్చి రూ.30 లక్షల నగదుతో నడుచుకుంటూ తిరిగి వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రోహన్ నగదు బ్యాగుతో ఉడాయించాడు. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి మారుతీ స్విఫ్ట్ కారులో బెంగళూరుకు వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా బెంగళూరులో రోహన్, బాలిగర్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.29.90 లక్షలు, కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పృథ్వీ రాజ్, ప్రసాద్ కోసం గాలిస్తున్నట్లు టాస్క్ఫోర్స్పోలీసులు తెలిపారు.