
నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : విలేజ్ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేస్తూ హౌజింగ్ లోన్లు ఇప్పిస్తున్న వైనం వరంగల్ జిల్లా నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో శుక్రవారం వెలుగు చూసింది. దీంతో సెక్రటరీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లకు ఎలాంటి పేపర్స్ లేకపోవడంతో ఓ ముఠా ఫేక్ ఓనర్ షిప్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. వీటిపై సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేస్తూ బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తున్నారు.
తాము ఎలాంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు నల్లబెల్లి మండలం కన్నారావుపేట సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. కాగా నర్సంపేట మండలం మహేశ్వరం కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. మహేశ్వరానికి చెందిన, ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నీ తానై ఈ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.