
పల్లె ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు. తాటాకులతో పందిళ్లు..రాములోరి కళ్యాణం.. పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడేరుగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని.. సీతమ్మ తల్లికి.. పూజలు చేస్తే సుఖ సంతోషాలతో.. పిల్లా.. పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతుంటారు. మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. . . .
చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీవిశ్వావశు నామ సంవత్సరం (2025)లో ఏప్రిల్ 6 వ తేది ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. . చైత్ర శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆరోజే జరిగాయని అంటారు.
శ్రీరామనవమి శుభ ముహూర్తం
- నవమి తిథి ప్రారంభం: 2025 ఏప్రిల్ 5వ తేదీసాయంత్రం7:26
- తిథి ముగింపు :2025 ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22
- శుభ ముహూర్తం : ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు
- పూజా సమయం వ్యవధి: 2 గంటలు 31 నిమిషాలు
- శ్రీరామచంద్రునికి.. సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం: ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12:24
శ్రీరామనవమి పండుగకు పది రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. తాటాకు పందిళ్లు వేయడం.. ఆలయాలకు రంగులు వేయడం..విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు. హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకునేవారు.
ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం ... అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. శుభ్రమైన బట్టలు ధరించిపూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్టించుకోవాలి. రామ దర్భార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడాపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. రామయ్య తండ్రికి.. అమ్మవారికి పూల దండలు సమర్పించాలి. చివరలో స్వామి పాదాల దగ్గర మూదుసార్లు అక్షింతలు వేస్తూ.. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి.
ALSO READ : Sriramanavami 2025: భద్రాచలంలో ఏప్రిల్ 6న రాములోరి కళ్యాణం.. మరి ఒంటిమిట్టలో ఎప్పుడంటే..
తర్వాత రామచరిత మానస్, సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం లో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పంచి పెట్టెవాళ్ళు. వాటి కోసమే చాలా మంది గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. దంపతి తాంబూలాలు, విసనకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు. శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే...