
‘ఈ రోజు తాము అనుకున్న రంగంలో సక్సెస్ సాధించినవారందరూ ఒకప్పుడు ఓటమి చెందినవారే.. అది పరీక్షలైనా, వ్యాపారమైనా, ఉద్యోగం, జీవితం.. ఏదైనా సరే మొదట్లో ఫెయిల్ అవడం సహజం, ఫెయిల్ తర్వాతే సక్సెస్, ఓటమి వెనుకే గెలుపు దాగి ఉంటుందనేది సత్యం’ జీవితంలో పరీక్షలు చిన్న భాగం మాత్రమే, పరీక్షలే జీవితం కాదు. ప్రపంచ ధనవంతుల్లో కొందరు కేవలం పాఠశాల వరకే చదివారనే విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడే కానీ.. ఏ పెద్ద చదువూ చదవలేదు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్ కూడా కేవలం పదవ తరగతే చదివారు. కానీ, వారనుకున్న దాంట్లో విజయం సాధించారు. ఈరోజు ప్రపంచ గుర్తించే విధంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, ఐన్స్టీన్, ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉదాహరణలున్నాయి. చదువులో రాణించలేనివారు వేరే రంగంలో సాధించి చూపారు. ప్రపంచం గుర్తించేలా ఎదిగారు.
కుంగిపోవద్దు
ఈనాడు అధికశాతం విద్యాసంస్థలు పరీక్షలంటే కేవలం మార్కులే అని భ్రమలో ఉన్నాయి. అదే విద్యార్థులపైన రుద్ది వారికి ఇదే వాస్తవమని అబద్ధపు ప్రపంచంలోకి నెట్టుతున్నారు. మొదటి ర్యాంకు రావాలి. కళాశాలకు పేరు రావాలని ఒత్తిడికి గురిచేస్తూ బాగా చదివే మిగతా విద్యార్థులతో పోల్చుతూ చూడడంతో కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురై కుంగిపోతున్నారు. అవగాహన లేని చదువులతో అధిక మార్కులతో, పాస్ సర్టిఫికెట్తో సాధించేదేమీ లేదు.
గతంలో ఇలా ఇంటరులో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెచ్చినవారు, జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచిన వారు కూడా, ఇంటర్లో పాసై తర్వాత ఎంసెట్, నీట్ లాంటి ఎన్నో పోటీ పరీక్షల్లో కనీస మార్కులు కూడా సాధించలేకపోయిన ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల విద్యార్థులపైనే అధిక ఒత్తిడి ఉంటుంది. ఆయా కాలేజీల ప్రచారం కోసం, వారి వ్యాపారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే అధిక ఒత్తిడికి విద్యార్థులు బలవుతున్నారు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా కళాశాలల మాదిరే ఇతర విద్యార్థులతో పోల్చుతూ వారి పిల్లలపై లేనిపోని టార్గెట్ పెట్టి, పిల్లల జీవితంలో ఒక భాగమైన చదువుల కోసం వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు.
ఓటమే.. సక్సెస్కు దారి
ఈరోజు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోవడం, నిరాశకు గురయ్యే ఆలోచనలు పిరికివారికే తప్పధైర్యవంతులకు రావు. సమస్యలను సాధించాలనే తపన ఉన్నవారు, భవిష్యత్ లక్ష్యం పెట్టుకున్న వారు సముద్రంలాగ శాంతంగా ఉంటారు. సరైన సమయంలో కెరటాలవలే ఎగిసి పడతారు. సాధించే వరకు ఓపికతో ఉండడమే అసలు విజయానికి మార్గం. ఓపిక, సహనానికి ధైర్యానికి మూలం ఓటమి చెందడమే.! ఓటమి చెందడం ఒక విధంగా మంచిదే, ఇదే గెలుపుకు నాందిగా మారుతుంది. ఒకసారి ఓడితేనే భవిష్యత్లో సమస్యలను అధిగమించే గుణాన్ని నేర్చుకుంటారు. ధైర్యవంతులుగా తయారవుతారు. వారిలో మరొకసారి ఓడిపోవద్దనే తపన, కసి పెరుగుతుంది. మానసికంగా ఎదుగుతారు. మానసిక నిపుణులు కూడా ఇదే చెబుతారు.
పదవ తరగతి లేదా ఇంటర్మీడియెట్లో ఒకసారి ఫెయిల్ అయినవారే భవిషత్లో అన్నింట్లో సక్సెస్ అవుతారని, చరిత్రలో విజయాలను సాధించిన వారి కొందరి జీవితాలను చదివితే అది నిజమే అని అర్ధమవుతుంది. పాజిటివ్ ఆలోచనే విజయానికి బాట పరీక్షల ఫలితాల సమయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి. మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా సరే, వారికి ధైర్యం ఇచ్చి మానసిక బలాన్ని అందించేవిధంగా వ్యవహరించాలి.
విద్యార్థులు కూడా మరొకసారి సాధించి చూపుతామనే గట్టి పట్టుదలతో, పట్టు వదలని విక్రమార్కుడిలా సాధిస్తాననే ధైర్యంగా ఉండి సాధించాలి. సాధించి చూపించాలి. నిరాశకు గురి కాకూడదు. నెగెటివ్ ఆలోచన కాకుండా ప్రతిసారి పాజిటివ్ ఆలోచనలతో కష్టపడితే తప్పక విజయం సొంతమవుతుంది. నిరాశ మనిషిని నిలువునా చీల్చుతుంది. ఆశ జీవితాలను నిలబెడుతుందనేది వాస్తవమని గ్రహించాలి.
సయ్యద్ జలీ, లెక్చరర్