
ఎస్ఐ ప్రిలిమ్స్ ఆగస్టు 7న, కానిస్టేబుల్ పరీక్ష ఆగస్టు 21 నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెడీ అవుతోంది. ఈ సమయంలో సగం మార్కులు వచ్చే జనరల్ స్టడీస్ విభాగం నుంచి ఏ సబ్జెక్టులు చదవాలి, ఎలాంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. క్విక్ రివిజన్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
ప్రిలిమ్స్ నెగ్గాలంటే..
ఇప్పుడున్న తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులు చదవడం కష్టం. సరైన ప్రణాళికతో ఎక్కువ మార్కులు వచ్చే తక్కువ సబ్జెక్టులను ఎంచుకొని రివిజన్ చేసుకుంటే ప్రిలిమ్స్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ప్రిలిమ్స్ పాసవ్వాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే, చదివితే సులువుగా ఉండే సబ్జెక్టులైన- ఆప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ సబ్జెక్టుల నుంచి ఎస్ఐ పరీక్షలో సుమారు 150 ప్రశ్నలు, కానిస్టేబుల్ పరీక్షలో 100కి పైగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటి మీద దృష్టిపెడితే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించవచ్చు.
పోలీస్ పరీక్షలో ప్రిలిమ్స్ అభ్యర్థులకు చాలా కీలకం. ఇందులో క్వాలిఫై అయితేనే తర్వాత రౌండ్స్కు ఎంపిక అవుతారు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ విభాగం చాలా కీలకం. నెగెటివ్ మార్కులు ఉండడంతో కొంతవరకు సమాధానాలు ఊహించవచ్చు. జీఎస్లో మొత్తం ఏడు సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో ఏవైనా ఐదు సబ్జెక్టులు సంపూర్ణంగా చదివితే 80 శాతం మార్కులు సులువుగా సాధించవచ్చు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, కరెంట్ అఫైర్స్పై స్పెషల్గా ఫోకస్ చేయాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్ర: ఉద్యమ చరిత్ర నుంచి దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే తెలంగాణ 1969 ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తవడంతో పాటు 2001లో టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏండ్లు పూర్తి చేసుకోవడం. ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టి శత వసంతాలు పూర్తి అయ్యాయి. ముల్కీకి సంబంధించి అంశాలు వివిధ రూపాలలో కన్పించి చివరకు 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 2 మల్టీ జోన్లు, 7 జోన్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనలో ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం, 1952లో ముల్కీ ఉద్యమం, 1969లో రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష నుంచి ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంది. మొబలైజేషన్ పీరియడ్లో (1971–90) సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్, జీవో నెంబర్ 36, ఐదు, ఎనిమిది, ఆరు సూత్రాల పథకం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు1975, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
జిల్లాల పాతపేర్లు-కొత్త పేర్లు: హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 8 జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. వీటి పాత పేర్లు, మారిన జిల్లా స్వరూపం మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ‘ఎల్గందుల’ అనేది కరీంనగర్ పూర్వ జిల్లా పేరు, ‘ఇందూరు’ నిజామాబాద్ జిల్లా పాత పేరు.
నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్: సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పద్మ పురస్కారాలు అందుకున్న వ్యక్తులు ముఖ్యంగా రాష్ట్రం నుంచి పద్మవిభూషణ్, పద్మ అవార్డులు అందుకున్న వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలి.
రాష్ట్రపతి-ఉపరాష్ట్రపతి: ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేపథ్యంతో పాటు గతంలో ఆమె గవర్నర్గా చేసిన జార్ఖండ్ రాష్ట్రం, చారిత్రక నేపథ్యం చదవాలి. రాష్ట్రపతిగా పనిచేసిన ముఖ్యమైన వ్యక్తుల నేపథ్యం గురించి తెలుసుకోవాలి. గతంలో ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన వ్యక్తుల గురించి చదువుకోవాలి.
ముఖ్యమంత్రులు, గవర్నర్లు: ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికైన నూతన ముఖ్యమంత్రులు, గవర్నర్లను గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణ నుంచి గవర్నర్ అయిన వ్యక్తులు, ఇప్పుడు ఏ రాష్ట్రానికి గవర్నర్లుగా పని చేస్తున్నారో తెలుసుకోవాలి. గత ఆరు నెలల కాలంలో వివిధ దేశాలకు ఎన్నికైన ప్రధానమంత్రులు, దేశాధ్యక్షుల గురించి అడిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ సంస్థలకు కొత్తగా నియమించబడిన వ్యక్తులు, ఏ దేశానికి చెందినవారు, వారి నేపథ్యం మొదలైన అంశాలు చదవాలి. 2021 మరియు 2022లో సదస్సులు ఎక్కడ జరిగాయి, సదస్సు థీమ్ ప్రిపేర్ అవ్వాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డులు, ఏ రంగంలో ఇస్తారు లాంటి అంశాలు గుర్తుంచుకోవాలి.
క్రీడాంశాలు: టెన్నిస్ గ్రాండ్స్లామ్స్ విజేతలు, ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్ షిప్స్లో పతకాలు సాధించినవారు, టాప్లో ఉన్న దేశాలు గుర్తుంచుకోవాలి.
కమిటీలు, కమిషన్లు: జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఫజల్ అలీ కమిషన్, జయభారత్ రెడ్డి కమిటీ, గిర్గ్లానీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోశయ్య కమిటీ, ఆంటోనీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. ఈ కమిటీలో సభ్యులు, వారు చేసిన ప్రతిపాదనలు, నియమించిన సంవత్సరం, రిపోర్టు అందజేసిన అంశాలు గుర్తుంచుకోవాలి.
ఉద్యమంలో పార్టీల పాత్ర: తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత ఏర్పాటైన రాజకీయ పార్టీలు, వాటి స్థాపకులు, ఏర్పాటు చేసిన సంవత్సరం అనే అంశాలపై అవగాహన ఉండాలి.
ఇండియన్ హిస్టరీ: ఇందులో నుంచి కనీసం 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత చరిత్రలో బౌద్ధ, జైన మతాలు, మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తానులు, మొగల్స్, భక్తి ఉద్యమం, 1857 సిపాయిల తిరుగుబాటు, అతివాదులు–మితవాదులు, గాంధీయుగం నుంచి 1947 వరకు జరిగిన పరిణామాల మీద ఫోకస్ చేయాలి.
జాతరలు: తెలంగాణ జాతరలు ‘సంస్కృతి’ అనే అంశం కిందకు వస్తుంది. ముఖ్యంగా సలేశ్వరం జాతర, కొమరవెల్లి మల్లన్న జాతర, నాగోబా, సమ్మక్క–సారక్క, ఏడుపాయల జాతర, జాన్పహాడ్ సైదన్న జాతర మొదలైనవి. జాతరకు సంబంధించి జిల్లాల పేర్లు, ఏ మాసంలో నిర్వహిస్తారు, ఎన్ని సంవత్సరాలకు జరుపుతారో అడుగుతారు.
పండుగలు: పండుగలకు సంబంధించి ముఖ్యంగా బోనాలు, బతుకమ్మ, తీజ్ పండుగ, వివిధ గిరిజన తెగలు నిర్వహించే పండుగలను చదవాలి. వాటిని ఏ మాసంలో జరుపుతారో అవగాహన ఉండాలి.
కళలు: తెలంగాణ ప్రాంతం ప్రాచీన కాలం నుంచి కళలకు ప్రసిద్ధి. ముఖ్యంగా దర్శనం మొగులయ్య, రామచందర్లు ఈ మధ్య కాలంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
హాండీక్రాప్ట్స్: పోచంపల్లి ఇక్కత్ చీర, సిద్ధిపేట గొల్లభామ చీరలు, ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన నిర్మల్ చెక్కబొమ్మలు, వరంగల్ దర్రీస్(దుప్పట్లు), ఈ మధ్యనే జీఐ ట్యాగ్ పొందిన నల్లగొండ జిల్లా ‘పుట్టపాక తెలియా రుమాల్’ మొదలైన అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
షెడ్యూల్ తెగల పండుగలు, వాయిద్యాలు: రాష్ట్రంలో షెడ్యూల్ తెగలకు ప్రాధాన్యత ఉంది. చెంచు తెగలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో, గోండు తెగలు మహారాష్ట్ర సరిహద్దులో, కోయ తెగలు చత్తీష్ గఢ్ సరిహద్దులో, లంబాడీ తెగలు మైదాన ప్రాంతాల్లో ఉంటారు. ఈ తెగల నృత్యాలు, ఉదాహరణకు గుస్సాడీ నృత్యం, దండారీ నృత్యం, కోయ నృత్యం, బంజార నృత్యం మొదలైనవి తెలుసుకోవాలి.
పాటలు: నిజాం కాలం నుంచి పాటలు లేకుండా జనం సమీకరించబడలేదు. తెలంగాణ ఉద్యమానికి పాటలు ఆయువుపట్టు, ఉదాహరణకు బండెనుక బండి కట్టి, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, అమ్మా తెలంగాణ మా ఆకలికేకల గానమా లాంటి పాటలకు సంబంధించిన రచయితల పేర్లు చదవాలి. ఉద్యమకాలంలో వచ్చిన పుస్తకాలు, వాటి రచయితల గురించి తెలియాలి. ఉదాహరణకు గిదీ తెలంగాణ, దగాపడ్డ తెలంగాణ, తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతుంది లాంటి పుస్తకాల మీద అవగాహన ఉండాలి.
ప్రసిద్ధ కట్టడాలు, నిర్మాణాలు: శాతవాహనుల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో వార్తల్లో నిలిచిన అంశాలు చదవాలి. ఉదాహరణకు యునెస్కో గుర్తించిన రామప్ప, భూదాన్ పోచంపల్లి టూరిజం, ఆలంపూర్లోని ఆలయం, చాళుక్యుల నాటి దేవాలయం ఆనవాళ్లు, ముడుమల్లోని ఏకశిల రాళ్లు మొదలైనవి. శాతవాహనుల నుంచి ఆసఫ్జాహీల వరకు ఉన్న కట్టడాలు కోటిలింగాల, ఫణిగిరి, కొలనుపాక, వెయ్యిస్థంబాల గుడి, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ రెసిడెన్సీ చారిత్రక నేపథ్యం నుంచి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది.
పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్