
తెలంగాణలో తొలిసారి గ్రూప్ -1 పరీక్షను అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్కు ఇప్పటినుంచి సరిగ్గా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఏ అంశాల మీద అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేయాలి, ముఖ్యమైన టాపిక్స్ ఎలా రివిజన్ చేసుకోవాలి, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో ప్రిపరేషన్ ప్లాన్ తెలుసుకుందాం..
గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ గమనిస్తే సంఖ్యా పరంగా చూస్తే 13 అంశాలు కనిపించినా, లోతుగా గమనిస్తే 22 విభాగాలు ఉంటాయి. మనం 13 అంశాలు పరిగణనలోకి తీసుకొని చూస్తే ప్రతి అంశం పైనా సరాసరి 12 నుంచి 13 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని ప్రకారమే మనం 50 రోజుల ప్లాన్ తయారుచేసుకోవాలి. రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షల ప్రశ్నపత్రానికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్పేపర్కు చాలా తేడా ఉంటుంది. గ్రూప్1 మెయిన్స్లో ఉండే సిలబస్ టైటిల్ని ప్రిలిమ్స్ పరీక్షలో పెట్టారు. మెయిన్స్లో రెండు పేపర్లు తప్ప మిగతావన్ని, మెయిన్స్ సిలబస్ ప్రిపేర్ అయితే, గ్రూప్1 ప్రిలిమ్స్ చాలా సులభంగా క్వాలిఫై కావచ్చు.
అంతర్జాతీయ సంబంధాలు–సంఘటనలు: కరెంట్ ఎఫైర్స్ తో సంబంధం లేకుండా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అనే అంశాలు వేరుగా ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు, ఇండియా విదేశీ విధానం, అలీన ఉద్యమం, ప్రపంచీకరణ, ప్రాంతీయ సహకారం మొదలైనవి ఉంటాయి. అంతర్జాతీయ సంఘటనలలో ముఖ్యంగా ఇంటర్పోల్, రెడ్క్రాస్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్, రిమ్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, నాటో, జీ77, జీ8, జీ20, జీ24 దేశాల సదస్సులు, వివిధ దేశాల మధ్య అణుసంబంధాలు ఇందులో ముఖ్యంగా ఉంటాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ: జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, జువాలజీకి సంబంధించిన అంశాలు వస్తాయి. ఈ స్టాటిక్ అంశాల నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం డైనమిక్ జనరల్ సైన్స్ మీదే ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కరోనా తర్వాత డైనమిక్ అంశాల జనరల్ సైన్స్కే ప్రాధాన్యత పెరిగింది. గత అయిదు సంవత్సరాల నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన విజయాలే కాకుండా, స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి వివిధ సంస్థలు చేసిన కృషి గురించి చదవాలి. ఉదాహరణకు డీఆర్డీవో, బార్క్, ఇస్రో, హాల్ సాధించిన విజయాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
పర్యావరణ సమస్యలు–విపత్తు నిర్వహణ: పర్యావరణానికి సంబంధించి స్టాక్హోమ్ సమావేశం నుంచి బయోడైవర్సిటీ సదస్సు వరకు ముఖ్యమైన చట్టాలు, వాటిలో ఉండే అంశాలు, ఇండియా పాటించిన నిబంధనల గురించి అవగాహన ఉండాలి. బయోడైవర్సిటీ చట్టం నుంచి భారత ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన వెట్ ల్యాండ్స్ వరకు చదువుకోవాలి. పర్యావరణ టాపిక్ ప్రాధాన్యత పోటీ పరీక్షల్లో పెరిగిపోయింది.
భారతదేశ ఆర్థిక, సాంఘిక అభివృద్ధి: ఆర్థిక అభివృద్ధి అనేది భారతదేశంలో మొదటి ప్రణాళిక నుంచి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక వరకు అభ్యర్థులకు అవగాహన ఉండాలి. అభివృద్ధి జరిగిన కోణం మాత్రమే చదవాలి, అభ్యర్థులు సంఖ్యలను గుర్తు పెట్టుకొని రాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా ప్రిపేర్ అయితే పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఇండియన్ ఎకానమిలో సాంఘిక అభివృద్ధి అనే కోణాన్ని మాత్రమే చదవాలి. సాంఘిక అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఎలా జరిగిందని, వీటిలో వివిధ సామాజిక వర్గాలకు ఉద్దేశించి ప్రారంభించిన పాలసీలు అభివృద్ధికి ఎలా దోహదపడ్డాయనే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకాలు, ఉపాధి కల్పన పథకాలు, గ్రామీణ ప్రాంతాల కొరకు ప్రవేశ పెట్టిన పాలసీల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
ప్రపంచ, భారత, తెలంగాణ జాగ్రఫీ: ఇందులో మూడు సబ్జెక్టులు ఉన్నా ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణ జాగ్రఫీకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇండియా జాగ్రఫీ, చివరి ప్రాధాన్యత ప్రపంచ జాగ్రఫీకి ఇవ్వాలి. కొవిడ్ ప్రభావంతో పాటు రష్యా–ఉక్రెయిన్, నూతన దేశాల ఏర్పాటు, శ్రీలంక సంక్షోభం, అఫ్ఘనిస్థాన్ సమస్య, భారతదేశం ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరంగా వార్తల్లో ఉండడం లాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇండియన్ జాగ్రఫీలో భౌగోళిక నైసర్గిక స్వరూపం, జనాభా, అడవులు, రవాణా వ్యవస్థ, నదీ వివాదాలు, స్మార్ట్ సిటీలు చదవాలి. తెలంగాణ జాగ్రఫీ నుంచి 33 జిల్లాల సమగ్ర సమాచారంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు రాస్తున్న తొలి పరీక్ష కావున ఎక్కువ ఫోకస్ చేయాలి. మ్యాపింగ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే జాగ్రఫీలో ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా: ఇందులో చరిత్రతో పాటు భారతదేశ వారసత్వ సంపద మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతేకాని చారిత్రక నేపథ్యం అంటే రాజకీయ నేపథ్యం అని చదవకూడదు. చరిత్ర సబ్జెక్టులో రాజకీయ నేపథ్యం ఉన్న ప్రశ్నలు తగ్గిపోయి, సాంఘిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయోద్యమం మీద వచ్చే ప్రశ్నలు సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా ఉండడంతో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మధ్యయుగ చరిత్రలో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ మధ్య ప్రాచీన చరిత్రకు ప్రాధాన్యత పెరిగింది.
రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ: అభ్యర్థులు రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థకు ఉన్న తేడా గమనించి ప్రిపేర్ అవ్వాలి. పోటీ పరీక్షలో రాజ్యాంగం అంశాలైన ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మూడొంతుల సిలబస్ పూర్తవుతుంది. రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ చాలా ముఖ్యమైనవి.గవర్నెన్స్–భారత ప్రభుత్వ విధానం: గవర్నెన్స్ గురించి ప్రిలిమ్స్లో కంటే మెయిన్స్లో ఎక్కువ అడుగుతున్నారు. ఇందులో ఎలక్షన్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, వివిధ కమిషన్స్ గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ విధానాలకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు విధాన పాలసీలు, అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు ముఖ్యంగా చదవాలి.
రాష్ట్ర పాలసీలు: గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ ఎకానమీ సిలబస్ లేకుండా రాష్ట్ర పాలసీలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ విధానాలతో పాటు సంక్షేమ పథకాలు ఈ అంశం కిందకే వస్తాయి. తెలంగాణ ఎకానమీలో సంఖ్యాపరమైన అంశాలు కాకుండా మిగతావన్నీ రాష్ట్ర పాలసీ అనే అంశం కిందకే వస్తాయి. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్: వాస్తవంగా పోటీ పరీక్షలో ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాదు, కానీ జెండర్, వివిధ తెగలకు, కులాలకు, అంగవైకల్యం వారికి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటి అమలు, సమాజంలో అట్టడుగు ప్రజలకు అందుతున్న పాలసీల గురించి చదవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద అవగాహన ఉండాలి.
మ్యాథ్స్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్: ఈ సబ్జెక్ట్ పూర్తిగా ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు ఒక గంట సమయం దీనికి కేటాయించాలి. జనరల్ స్టడీస్తో పాటు వీటి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ప్యూర్ మ్యాథ్స్ కష్టంగా భావిస్తే రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తెలంగాణ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం: గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ ఉద్యమ చరిత్ర (1948–2014) సిలబస్లో లేదు. కాని 1948 నుంచి ఇప్పటివరకు సమాజం, సంస్కృతి, సంపద, కళలు, సాహిత్యానికి సంబంధించిన అంశాలు మాత్రం ఉన్నాయి. ఈ అంశాన్ని మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలంగాణ చరిత్రగా విభజించుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి, రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రశ్నలు అధికంగా వచ్చేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ, ఆర్థిక చరిత్రకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయి, సాంస్కృతిక, సామాజిక చరిత్రకు ప్రాధాన్యత పెరిగింది.
కరెంట్ ఎఫైర్స్: ఇందులో మొత్తం మూడు అంశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ, అంతర్జాతీయ అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన విజయాలు పోటీ పరీక్షలో ఎక్కువ అడిగే అవకాశం ఉంది. ఈ విజయాలు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరీక్షకు కనీసం 45 రోజుల ముందు వరకు చదువుకొని వెళ్లాలి. కరెంట్ ఎఫైర్స్ను పూర్తిగా కరెంట్ రిలేటెడ్ అంశాలు, సబ్జెక్టుకు అనుసంధానంగా ఉండేవిగా విభజించుకోవాలి. పరీక్షకు ఆరు నెలల ముందు జరిగిన అంశాలను పరీక్ష కోణంలో చదివి, పరీక్షకు రెండు నెలల ముందు జరిగిన అంశాలను లోతుగా విశ్లేషించి చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు. అంతర్జాతీయ అంశాల్లో ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్వాడ్ దేశాల సదస్సు, సౌత్ చైనా సముద్రం, జీ20 సమావేశం, బిమ్స్టెక్, ఆసియాన్, అపెక్ మొదలైన అంతర్జాతీయ సదస్సుల మీద ఫోకస్ చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చిన ప్రదేశాలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న భారతీయుల గురించి చదువుకోవాలి.
పృథ్వీ కుమార్ చౌహాన్
పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్