
రూ.3,678 కోట్లకు మార్కెట్
మూడున్నర రెట్లు జంప్
కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ అంచనా
న్యూఢిల్లీ : ప్రజలు స్మార్ట్ఫోన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలిసిందే. ఒకవేళ ప్రమాదవశాత్తు అది చేతిలో నుంచి జారి కిందపడి పగిలితే తల్లడిల్లిపోతారు. ఎక్స్ట్రా కాస్ట్లను భరించలేక స్మార్ట్ఫోన్ ఓనర్లకు మస్తు ఇబ్బంది అవుతోంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చాలా మంది ఇప్పుడు స్మార్ట్ఫోన్కు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఇండియన్ స్మార్ట్ఫోన్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2025 నాటికి వార్షికంగా 29 శాతం చొప్పున పెరిగి రూ.3,678 కోట్లకు చేరుకుంటుందని కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ అంచనావేస్తోంది.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఇన్సూరెన్స్ మార్కెట్ రూ.1,030 కోట్లుగా ఉందని తెలిపింది. ఇది 2025 నాటికి మూడున్నర రెట్లు పెరుగుతుందని వెల్లడించింది. ఒకవైపు స్మార్ట్ఫోన్ యూజర్ బేస్ కూడా అలానే పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ కొనేవారు పెరుగుతుండటంతో.. దీన్ని ఇన్సూరెన్స్ మార్కెట్ రయ్మని పరుగులు పెడుతోంది. 2025 చివరి నాటికి ఏడాదికి 7.8 కోట్ల మంది కొత్త యూజర్లు చేరతారని చెప్పింది. స్మార్ట్ఫోన్కు ఇన్సూరెన్స్ కవర్ ఉంటే మంచిదని చాలామంది భావిస్తున్నారని పేర్కొంది. 50 శాతానికి పైగా యూజర్లు కచ్చితంగా ఒకటైనా ఇన్సూరెన్స్ కవర్ను తీసుకుంటున్నారని తెలిపింది. ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి స్మార్ట్ఫోన్ ఇన్సూరెన్స్ మంచి అవకాశంగా ఉందని రెడ్సీర్ కన్సల్టింగ్ ఇండియా హెడ్ అభిషేక్ చౌహాన్ అన్నారు. ఈ ఇండస్ట్రీ సక్సెస్కు రెగ్యులేటరీ ప్రమేయం కావాలని చెప్పారు.