పదేళ్ల తర్వాత పాలమూరు వర్సిటీకి ఫండ్స్​

పదేళ్ల తర్వాత  పాలమూరు వర్సిటీకి ఫండ్స్​
  • జీతాలు, అభివృద్ధి పనులకు రూ.48 కోట్ల కేటాయింపులు
  • ఇన్ ​ఫ్రాస్ర్టక్చర్​ లా, ఇంజనీరింగ్​ కాలేజీల బిల్డింగులు, హాస్టళ్ల నిర్మాణాలకు సరిపడా ఫండ్స్
  • బీఆర్‌‌ఎస్​ హయాంలో 2019 నుంచి జీతాలకే బడ్జెట్‌లో కేటాయింపులు 

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి పదేండ్ల తర్వాత భారీగా నిధులను  కేటాయించారు. ఈ ఫండ్స్ తో  రానున్న అకడమిక్​ ఇయర్ నుంచి  లా,  ఇంజనీరింగ్​ కాలేజీల బిల్డింగులు, హాస్టళ్లు, బాయ్స్, గర్ల్స్​కొత్త హాస్టళ్ల నిర్మాణాలకు పునాదులు పడనున్నాయి. 

కాంగ్రెస్​ హయాంలోనే నిధులు..

2023లో రాష్ర్టంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. వర్సిటీకి ప్రధాన మంత్రి ఉచ్ఛతర్​ శిక్షా అభియాన్​  (పీఎం యూఎస్​హెచ్​ఏ) కింద ఎంపిక చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో 2024 ఫిబ్రవరిలో ఈ స్కీం కింద వర్సిటీకి రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్​ ద్వారా వర్సిటీలో కొత్తగా రూ.20 కోట్లతో గర్ల్స్, బాయ్స్​ హాస్టళ్లు, ఇతర అకడమిక్​ బిల్డింగులు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ పనుల కోసం వెచ్చించారు. అదే ఏడాది జరిగిన రాష్ర్ట బడ్జెట్​లో ప్రభుత్వం వర్సిటీలోని సిబ్బంది జీతాల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇటీవల వర్సిటీకి లా, ఇంజనీరింగ్​ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఈ కాలేజీలను వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి ప్రారభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

దీంతో అలర్ట్​ అయిన ప్రభుత్వం.. వర్సిటీలో అందుబాటులో ఉన్న స్థలంలో ఈ కాలేజీల బిల్డింగులు, వీటికి సంబంధించిన ఇతర ఇన్​ఫ్రాస్ర్టక్టర్​ నిర్మాణాల కోసం స్థల పరిశీలనలు పూర్తి చేసింది. బడ్జెట్​ లేకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్​ పడింది. అయితే తాజా బడ్జెట్​లో వర్సిటీ ​ కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. పలు డెవటప్​మెంట్​ పనుల కోసం దాదాపు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా.. రాష్ర్ట ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తాజా బడ్జెట్​లో రూ.48 కోట్ల కేటాయింపులు చేసింది. అందులో రూ.36 కోట్లు లా, ఇంజనీరింగ్​ కాలేజీలు, ఇతర అవసరాలకు.. మరో రూ.12 కోట్లు సిబ్బంది జీతభత్యాల కోసం మంజూరు చేసింది. 

నిధులు వచ్చిన వెంటనే వర్సిటీలో ఈ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. నాలుగు నెలల టార్గెట్​ పెట్టుకొని.. యుద్ధ ప్రాతిపతికను పనులు పూర్తి చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. కాగా 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ సీఎంగా నల్లారి కిరణ్​ కుమార్​ రెడ్డి పీయూను సందర్శించి రూ.16 కోట్లు డెవలప్​మెంట్​ కోసం ఫండ్స్​ రిలీజ్​ చేశారు.  మళ్లీ పదేండ్లకు అదే కాంగ్రెస్​ గవర్నమెంట్​ రూలింగ్​లోకి రాగానే పీయూకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్సిటీ డెవలప్​మెంట్​ కోసం తాజా బడ్జెట్​లో రూ.48 కోట్లు కేటాయించడం పట్ల పీయూ సిబ్బంది, స్టూడెంట్లు సంతోషంలో ఉన్నారు.

ఏడేండ్లలో రెండు సార్లే..

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేండ్ల పాటు పాలమూరు వర్సిటీ డెవలప్​మెంట్​పై ఫోకస్​ పెట్టలేదు. మొదటి మూడేళ్లు నామమాత్రంగా నిధులు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత 2017 నుంచి 2023 వరకు జరిగిన బడ్జెట్​లలో జీతాల కోసం రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల చొప్పున కేటాయింపులు చేసింది. ఈ ఆరేండ్లలో డెవలప్​మెంట్​ కోసం కేవలం రూ.8 కోట్ల నిధులు మాత్రమే బడ్జెట్​లో కేటాయించింది. అయితే 2017లో న్యాక్​ గుర్తింపు రావడంతో.. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వర్సిటీకి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్​తోనే వీసీ రెసిడెన్సీ, గెస్ట్​ హౌస్​, మోడల్​ ఎగ్జామినేషన్​ బ్రాంచ్​, గద్వాలలో బాయ్స్​, గర్ల్స్​ హాస్టళ్లు​, వనపర్తిలో బాయ్స్​హాస్టల్​, కొల్లాపూర్​లో అకాడమిక్​ బిల్డింగ్​తో పాటు యూనివర్సిటీలో 20 ఫీట్ల రోడ్లు, ఆర్చి గేటు,  పీయూ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది ఫీట్ల ఎత్తులో కాంపౌండ్​ వాల్ నిర్మాణ పనులకు  వినియోగించారు.

ఆరేళ్లుగా పీయూకు బడ్జెట్​ కేటాయింపులు ఇలా (కోట్లల్లో..)

ఏడాది    ప్రతిపాదన   కేటాయింపులు
2019-20    119    6.63
2020-21    216    7.36
2021-22    137    7.58
2022-23    75    9.58
2023-24    84    10.91
2024-25    200    48