
- క్యూ4 లో రెవెన్యూ రూ.15,013 కోట్లు
- మొత్తం 2024–25లో రూ.64,138 కోట్లకు పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ (క్యూ4) లో రూ. 2,475 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. మార్జిన్లు పడిపోవడంతో ప్రాఫిట్ కిందటేడాది క్యూ4 లో వచ్చిన రూ. 2,561 కోట్ల నుంచి కొద్దిగా తగ్గింది. అయితే సేల్స్ మాత్రం పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది క్యూ4 లో హెచ్యూఎల్ ఆదాయం ఏడాది లెక్కన 2.68 శాతం పెరిగి రూ. 15,013 కోట్ల నుంచి రూ. 15,416 కోట్లకు చేరింది. “కంపెనీ సేల్స్ 3 శాతం వృద్ధి నమోదు చేశాయి” అని హెచ్యూఎల్ తెలిపింది. కానీ, ఇబిటా (వడ్డీలు, ట్యాక్స్లకు ముందు ప్రాఫిట్) మార్జిన్ మాత్రం ఏడాది లెక్కన 30 బేసిస్ పాయింట్లు తగ్గి 23.1 శాతానికి పడింది. మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం ఖర్చులు రూ. 12,478 కోట్లకు చేరాయి. కిందటేడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే 3.12 శాతం పెరిగాయి.
రాణించిన హోమ్కేర్ బిజినెస్
హెచ్యూఎల్ ఆదాయం హోమ్ కేర్ విభాగం నుంచి ఏడాది లెక్కన 1.85 శాతం పెరిగి రూ. 5,815 కోట్లకు చేరింది. వస్తువులపై ధరలను తగ్గించామని, అందుకే ఈ సెగ్మెంట్లో సేల్స్ పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఫాబ్రిక్ వాష్, ఫాబ్రిక్ కండిషనర్ల సేల్స్ బాగున్నాయని తెలిపింది. ‘బ్యూటీ అండ్ వెల్బీయింగ్’ విభాగంలో సేల్స్ 6.62 శాతం వృద్ధి చెంది రూ. 3,265 కోట్లకు చేరాయి. అదేవిధంగా, పర్సనల్ కేర్ విభాగం నుంచి హెచ్యూఎల్ ఆదాయం 3.05 శాతం పెరిగి రూ. 2,126 కోట్లకు చేరింది. సన్సిల్క్, డవ్, పాండ్స్, పియర్స్, రెక్సోనా, క్లోజప్ వంటి బ్రాండ్లను కలిగి ఉన్న ఈ విభాగంలో సేల్స్ బాగున్నాయి. బాడీ వాష్లు, షాంపూలు, కండిషనర్లతో కూడిన నాన్-హైజీన్ విభాగంలో సేల్స్ పెరగగా, ఓరల్ కేర్ సెగ్మెంట్లో తక్కువ వృద్ధి నమోదైంది. ఆహార విభాగం నుంచి కంపెనీకి రూ.3,896 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో ఈ సెగ్మెంట్ నుంచి కంపెనీకి రూ. 3,910 కోట్ల ఆదాయం వచ్చింది. కెచప్, మయెనీస్ వంటి ప్రొడక్ట్ల సేల్స్ బాగుండడంతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగం వృద్ధి నమోదు చేసింది.
క్వాలిటీ వాల్స్, కార్నెట్టో, మాగ్నమ్ వంటి బ్రాండ్ల కారణంగా కంపెనీ ఐస్క్రీమ్ వ్యాపారం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసింది. ఎగుమతులు, కన్సైన్మెంట్ వంటివి కలిగిన ‘ఇతర విభాగం’ నుంచి హెచ్యూఎల్కు మార్చి క్వార్టర్లో రూ. 568 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఏడాది లెక్కన ఇది 21.88 శాతం ఎక్కువ. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్యూఎల్కు కన్సాలిటేడెట్గా రూ. 10,671 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 10,282 కోట్లతో పోలిస్తే 3.78 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయం 2.28 శాతం పెరిగి రూ. రూ. 64,138 కోట్లకు చేరిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వివరించింది.
నెస్లే సూపర్..
నెస్లే ఇండియా ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ. 885.4 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఎనలిస్టుల అంచనా రూ. 892 కోట్లకు ఇది దగ్గరగా ఉంది. కార్యకలాపాల నుంచి రూ. 5,503 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది అంచనా వేసిన రూ. 5,530 కోట్లకు దాదాపు సమానం. మార్చి క్వార్టర్లో ఆదాయం స్వల్పంగా పెరిగింది. వివిధ విభాగాలలో స్థిరమైన డిమాండ్ కనిపించిందని కంపెనీ తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నా, ధరలను పెంచలేదని పేర్కొంది. క్యూ4లో నెస్లే ఇబిటా రూ. 1,389 కోట్లుగా ఉంది. ఇబిటా మార్జిన్ 25.2 శాతానికి విస్తరించింది. కంపెనీ బోర్డు 2024–25 ఆర్థిక సంవత్సరం కోసం ఈక్విటీ షేరుకు రూ. 10 తుది డివిడెండ్ను సిఫారసు చేసింది. నెస్లే ఇండియా షేరు గురువారం రూ.2,433.20 వద్ద ఫ్లాట్గా ముగిసింది.