![భార్యపై అనుమానంతో ..భర్త ఆత్మహత్యా యత్నం](https://static.v6velugu.com/uploads/2025/02/husband-attempts-lifeend--over-suspicion-of-his-wife-at-secunderabad_2KoEclWLq9.jpg)
సికింద్రాబాద్లో ఘటన
పద్మారావునగర్, వెలుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య పనిచేసే షాపులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకోగా 98 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి కండిషన్సీరియస్గా ఉన్నది. ఈ ఘటన సికింద్రాబాద్లో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
మౌనిక, శ్రావణ్ (37) దంపతులు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని కామాక్షి సిల్క్స్ క్లాత్ షోరూమ్ లో మౌనిక జాబ్ చేస్తున్నది. అయితే, భార్య పై అనుమానం పెంచుకున్న శ్రావణ్ ఆదివారం మధ్యాహ్నం షాప్కు వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. తిరిగి సాయంత్రం షాప్కు పెట్రోల్ బాటిల్ తో వచ్చాడు. కస్టమర్లు ఉన్న సమయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు.
దీంతో షాక్ తిన్న కస్టమర్లు దుకాణం నుంచి పరుగులు తీశారు. పక్కనే ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్ను వెంటనే 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు అతడికి అత్యవసర ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాదాపు 98 శాతం శరీరం కాలిపోయినట్టు క్యాజువాలిటీ మెడికల్ఆఫీసర్ తెలిపారు. శ్రావణ్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.