
- మూసీ ప్రక్షాళన ఆపే ప్రసక్తే లేదు: మండలిలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- 770 చ.కి.మీ.లలో ఫ్యూచర్ సిటీ
- నార్త్ సైడ్ ట్రిపుల్ ఆర్కు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం!
- మెట్రో, మూసీ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ఆర్, మెట్రో కారిడార్, మూసీనది పునరుజ్జీవం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని ముందుకు సాగుతామన్నారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తలపెట్టిన ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి రెండు నెలల్లోపు కేంద్ర కేబినెట్నుంచి ఆమోదం లభిస్తుందని వెల్లడించారు.
శాసనమండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సుంకరి రాజు, కవిత, జీవన్రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమాధానాలు ఇచ్చారు. దేశంలో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. గత ప్రభుత్వ హయాంలో 9వ స్థానానికి పడిపోయిందని అన్నారు. మళ్లీ మన మెట్రోను దేశంలో మొదటి స్థానానికి తీసుకువస్తామని వెల్లడించారు.
ప్రతిష్టాత్మకమైన మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ఆర్ను మరో నాలుగు, ఐదేండ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కేంద్రం సహకారం తప్పనిసరి అని.. మెట్రో, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రాజెక్టు ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్తామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ, మెట్రో కారిడార్ పనులు వేగవంతం..
హైదరాబాద్కు ఆనుకుని ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనపై బీఆర్ఎస్ సభ్యుడు శంభీపూర్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు దీటుగా సమాధానం చెప్పారు. ఫోర్త్ సిటీ కాకుండా ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం మోడల్ ప్లాన్డ్ సిటీగా నిర్మిస్తున్నామని చెప్పారు.“రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 770 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోంది.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా భూసేకర ణ చేస్తం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు దీటుగా ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో కారిడార్ కోసం పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్తున్నాం. మెట్రోకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదు. కేంద్రం సహకరించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తాం. రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు సహకరించాలి’’ అని శ్రీధర్ బాబు అన్నారు.
మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్ట్ చేసి తీరుతం
హైదరాబాద్, నల్గొండ జిల్లాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు మూసీనది పునరుజ్జీవం చేసి తీరుతా మని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మొదటి ఫేజ్ కింద బాపూఠాట్ నుంచి ‘గాంధీ సరోవర్’ పేరుతో పనులు ప్రారంభించామని, మూసీలో ఇండ్లు కోల్పోతున్న వారికి ఇప్పటికే 309 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నష్టపరిహారం అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం బీజేపీ పాలిత ప్రాంతాలకు మాత్రమే నిధులు మంజూరు చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి, తాను అనేక సార్లు ప్రధానిని కలిశామని, ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని శ్రీధర్బాబు వెల్లడించారు.
ట్రిపుల్ ఆర్నుగత ప్రభుత్వం పట్టించుకోలే
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చాయని తెలిపారు. గత సర్కారు ఓఆర్ఆర్ను 30 ఏండ్లకు లీజుకింద అమ్ముకుం దని ఆరోపించారు.
‘హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తలపెట్టిన నార్త్ సైడ్ ట్రిపుల్ఆర్కు మరో రెండు నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీని ఏడు సార్లు కలిశాం. హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ కింద 78 కిలో మీటర్ల ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను అభివృద్ధి చేస్తం. విధ్వంసం చేసిన హైదరా బాద్ సిటీని మరోసారి ప్రపంచపటంలో పెడతాం. కేంద్రం సహకరిస్తే మరో మూడు నాలుగేండ్లలో ట్రిపుల్ ఆర్ను పూర్తి చేస్తాం” అని మంత్రి వెంకట్రెడ్డి అన్నారు.