
- ఆస్తులు.. పదవి ఇవ్వలేదు విచారణలో వెల్లడించిన కీర్తి తేజ్
- పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్
పంజాగుట్ట, వెలుగు: పారిశ్రామికవేత్త చంద్రశేఖర జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. తన తాత తనను బిచ్చగాడిలా చూశాడని, అందుకే చంపేశానని చెప్పాడు. విచారణ వివరాలను పంజాగుట్ట సీఐ శోభన్ వెల్లడించాడు. ‘‘మా తాత మిగతా వారితో సమానంగా నన్ను చూడలేదు. చిన్నచూపు చూశారు. అలా అని ఆస్తులు కూడా పంచివ్వలేదు. ఏ పదవీ ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడ్డాను. చివరకు నన్ను బిచ్చగాడిలా చూసేసరికి భరించలేకపోయా. అందుకే విసిగిపోయి చంపేశా’’అని నిందితుడు కీర్తి తేజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడైన కీర్తి తేజ్ను పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
హత్య తర్వాత ఎక్కడికి వెళ్లాడు? ఏం చేశాడు? హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? అన్న కోణంలో విచారణ జరిపారు. తన తాత తనకు ఎలాంటి విలువ ఇవ్వలేదని, అందరి ముందు తనను హేళన చేసేవారని కీర్తి తేజ్ తెలిపాడు. కాగా, జనార్దన్ రావు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు కీర్తి తేజ్ ఒంటిపై రక్తపు మరకలున్న షర్ట్ను, పొడిచిన కత్తిని బీఎస్ మక్తా వద్ద తగలబెట్టాడు. షర్టు, కత్తి పిడి కాలిపోగా, కత్తి దొరికింది. ఆ ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.