
గచ్చిబౌలి, వెలుగు: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు టాయిలెట్స్ కట్టించి, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దంపతులు దాతృత్వం చాటుకున్నారు. హైదరాబాద్లోని చందానగర్కు చెందిన వీణ సజ్జన, ఆమె భర్త నవీన్ కుమార్ ఐటీ ఉద్యోగులు. శేరిలింగంపల్లి శాంతినగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ సరిగా లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి వచ్చింది. దీంతో తన ఫ్రెండ్స్, బంధువుల నుంచి రూ.3 లక్షల వరకు సేకరించారు. ఆ డబ్బుతో బాయ్స్, గర్ల్స్ కోసం వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మించారు.
దాదాపు ఆరు నెలలు కష్టపడి విద్యార్థుల కష్టాలు తీర్చారు. ఈ సందర్భంగా శుక్రవారం వీణసజ్జన దంపతులను స్కూల్ హెచ్ఎం, సిబ్బంది, విద్యార్థులు సన్మానించి, వారి చేత టాయిలెట్స్ ప్రారంభించారు. వీణ గతంలోనూ చందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, స్టేషనరీని స్పాన్సర్ చేశారు.