హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కుత్బుల్లాపూర్ లోని కొంపల్లి, సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లీకై భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రధాన రోడ్డు పక్కన ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో.. అది చూసిన జనాలు భయంతో పరుగులు తీశారు.
మెయిన్ రోడ్డుపైన ఏమీ జరగకుండా మంటలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా అయోమయానికి గురయ్యారు. ఏమైందో అర్థకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. ఘటనా స్థలానికి ఎదురుగా ఉన్న షాపు యజమానులు వారి దుకాణాల్లోకి మంటలు ఎగిసిపడతాయనే భయంతో క్లోజ్ చేశారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భాగ్యనగర్ గ్యాస్ సరఫరా పైపు లీక్ అయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో కొంపల్లి, సుచిత్ర ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ లో ఇరుక్కున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.