శామీర్పేట్, మేడ్చల్ వైపు ఉంటున్న పబ్లిక్కు మంచి రోజులొచ్చాయ్..

శామీర్పేట్, మేడ్చల్ వైపు ఉంటున్న పబ్లిక్కు మంచి రోజులొచ్చాయ్..

సికింద్రాబాద్/హైదరాబాద్: శామీర్పేట్, మేడ్చల్ వైపు ఉంటున్న పబ్లిక్కు మంచి రోజులొచ్చాయ్. శామీర్పేట్, మేడ్చల్ మెట్రో కారిడార్లలో సర్వే పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు లోపు ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తి కానున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ (24 కి.మీ), జేబీఎస్ నుంచి శామీర్ పేట్ (21 కి.మీ) మెట్రో కారిడార్ లకు డీపీఆర్ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. డీపీఆర్ల తయారీకి ముఖ్యంగా మూడు రకాలైన అధ్యయనాలు అవసరమని.. అవి... ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు (జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్), పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అని ఆయన వివరించారు.

ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలను పరిశీలిస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. 

ఇక భూసామర్థ్య పరీక్షల్లో భాగంగా.. ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి  విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని మెట్రో ఎండీ వివరించారు. సామాన్యంగా ప్రతి అర కిలోమీటరుకు ఒక బోర్ హోల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోందని, ఒక్కొక్క బోర్ హోల్ను ఏభై నుంచి వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, ఏ స్థాయిలో భూమి గట్టితనం గానీ లేదా రాతి పొరలు తగులుతాయో పరిశీలిస్తామని మెట్రో ఎండీ చెప్పారు. 

ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం వల్ల, ఇప్పుడు మెట్రో సంస్థ జేబీఎస్-మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్-శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల భూసామర్థ్య పరీక్షలు చేస్తుందని ఆయన తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని.. ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరుకు శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్లను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం సమర్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.