చంద్రాయణగుట్టలో 103 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత

చంద్రాయణగుట్టలో 103 క్వింటాళ్ల  పీడీఎస్​ బియ్యం పట్టివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు : అక్రమంగా 103 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒకరిని  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్  పోలీసులు, సివిల్ సప్లయీస్​ అధికారులు, చంద్రాయణగుట్ట పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని టాస్క్​ఫోర్స్​అడిషనల్​ డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. చంద్రాయణగుట్టకు చెందిన విక్వర్, అలీమ్ పీడీఎస్​ బియ్యాన్ని  తక్కువ ధరకు కొని, అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. 

బియ్యాన్ని బోరబండకు చెందిన యూసుఫ్ (45) డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా చంద్రాయణగుట్టలో పట్టుకున్నారు. యూసుఫ్​ ను అరెస్ట్​ చేసి,  బియ్యాన్ని చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. దాడుల్లో సౌత్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, ఎస్ఐలు ఎం. మహేశ్, కె. నర్సింలు, జి. ఆంజనేయులు, ఎన్. నవీన్ పాల్గొన్నారు.