
హైదరాబాద్: ఐపీఎల్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ గుర్తించింది. లీగ్లో 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను సదరు బిజినెస్మెన్ కాంటాక్ట్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. మ్యాచ్ ఫిక్సింగ్కు తెర వెనక ప్రయత్నాలు షురూ కావడంతో అప్రమత్తమైన బీసీసీఐ.. ఈ మేరకు అన్ని ఫ్రాంఛైజ్ల యజమాన్యాలు, ఆటగాళ్లు, జట్ల మేనేజర్లు, కోచ్లు, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసింది.
ఎవరూ ఫిక్సింగ్ వలలో చిక్కుకోవద్దని బీసీసీఐ హెచ్చరికలు పంపింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ ఆరోపించడంతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను వ్యాపారవేత్త కలిశాడని బీసీసీఐ చెప్పడంతో.. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు బీసీసీఐని కోరారు.
►ALSO READ | DC vs RR: స్టార్క్ బ్యాక్ ఫుట్ నో బాల్.. ఆసీస్ ఫాస్ట్ బౌలర్కు అంపైర్ బిగ్ షాక్
అలాగే.. ఐపీఎల్లో ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న హైదరాబాద్కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తోన్న పోలీసులు.. ఏ మాత్రం తేడా అనిపించిన వెంటనే నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ 18వ ఎడిషన్ సగం పూర్తి అయ్యాక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణలపతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నాయి. తాజాగా ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.