
- 8 మందికి సమన్లు
- నేటితో షార్ట్టర్మ్ వీసాలు రద్దు, 29 వరకు మెడికల్ వీసాలు
- లాంగ్ టర్మ్ వీసాలు
- ఉన్న వారి ఇండ్లలో సోదాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశస్తుల ఏరివేత షురూ అయ్యింది. షార్ట్ టర్మ్, మెడికల్, బిజినెస్ వీసాలు కలిగి ఉన్న వారికి ‘లీవ్ ఇండియా’పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న 8 మందికి శనివారం నోటీసులు అందించారు. పహల్గాం ఘటన, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పాకిస్తానీయులు వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. షార్ట్ టర్మ్ వీసాలు ఆదివారం వరకు, మెడికల్ వీసాలు ఉన్న వారు ఈ నెల 29 వరకు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 230 మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో సిటీ కమిషనరేట్ పరిధిలో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో 156 మందికి పైగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఇందులో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ సహా ఇతర వీసాలు కలిగి ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాకిస్తాన్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలతో డేటాను రికార్డ్ చేస్తున్నారు.
ఎఫ్ఆర్ఆర్ఓతో కలిసి సోదాలకు ఏర్పాట్లు..
ఇమ్మిగ్రేషన్ అధికారుల అందించిన పాకిస్తానీయుల డేటా ఆధారంగా ఆయా అడ్రసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి సోదాలు తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పర్మినెంట్ వీసాలు కలిగి ఉన్న వారి పాస్పోర్టులపై స్టాంపింగ్ ఆధారంగా వారి ట్రావెల్ హిస్టరీని సేకరించనున్నారు. ఈ క్రమంలోనే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు (ఎఫ్ఆర్ఆర్ఓ) రికార్డుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పర్మినెంట్ వీసాలపై వచ్చిన వారు ప్రస్తుతం ఎలాంటి పనులు చేస్తున్నారు.. వారి ఆర్థిక పరిస్థితులు, పాస్పోర్టులపై స్టాంపింగ్ సహా ప్రయాణ వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు పాకిస్తానీయులను దేశం నుంచి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధివిధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. రోహింగ్యాలపై కూడా నిరంతర నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు.