
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో బుధవారం నాలుగు చోట్ల దాడులు నిర్వహించి, రూ. 6.50 లక్షల విలువైన 12.7 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులు కలిసి సీజ్ చేశారు. ముసారాంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. విశాఖకు చెందిన షేక్ సాహెబ్ ఖాన్, సిటీకి చెందిన మహ్మద్ అలీని అరెస్ట్ చేసి, 9 కిలోల సరుకు సీజ్ చేశారు.
మరో కేసులో అమీర్పేటలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన చుక్కా ఆనంద్బాబు గంజాయి అమ్మకాలు చేస్తుండగా, పట్టుకొని కేజీ గంజాయి సీజ్ చేశారు. అలాగే శేరిలింగంపల్లి ప్రాంతంలో కనిమర్ల సాయి ప్రవీణ్, ఆదిల్ పాషా వద్ద వేర్వేరుగా మొత్తం రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ మహారాష్ట్ర నుంచి గంజాయిని దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.