
హైదరాబాద్, వెలుగు: పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ అంబులెన్స్లో కుక్కను తరలిస్తూ.. సైరన్ వేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హిమాయత్నగర్ నుంచి మదీనా గూడ వైపు సైరన్తో ఓ అంబులెన్స్ వెళ్తుండగా.. పంజాగుట్ట వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అంబులెన్స్ డోర్ తెరచి చూస్తే అందులో కుక్క మాత్రమే ఉంది. దీంతో పోలీసులు షాక్ గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో రోగులుంటేనే సైరన్ వేసి తీసుకు వెళ్లాలని డ్రైవర్ను హెచ్చరించారు.
కుక్కను మియాపూర్లో వేసెక్టమీ ఆపరేషన్ చేయించేందుకు తీసుకు వెళ్తున్నట్టు డ్రైవర్ చెప్పాడు. దీంతో అంబులెన్స్ ఓనర్ అబ్దుల్ కలీమ్ పై పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసు కమిషనర్ ఆదేశాల ప్రకారం అంబులెన్స్ల పనితీరు పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా సదరు అంబులెన్స్ను తనిఖీ చేసినట్టు తెలిపారు. అంబులెన్స్కు ఉండే ట్రాఫిక్ మినహాయింపులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.