
తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో మూడు రోజులపాటు మొదటి జాతీయ యువ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో జీవ వైవిధ్య పరిరక్షణకు, పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న యువకుల ఉమ్మడి ఆకాంక్షలు, ఆందోళనలు, పరిష్కారాలను ఒకచోట చేర్చి తొమ్మిది ఆచరించతగిన అంశాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు.
డిక్లరేషన్లోని అంశాలు
- సహజ వనరులను విచక్షణతో వినియోగించేలా యువతకు సాంకేతికత నైపుణ్యాలను అందించేలా పర్యావరణ సంస్థలకు మద్దతు ఇవ్వడం.
- పాఠశాలల్లో అనుభవపూర్వకమైన అభ్యాస పద్ధతులను తప్పనిసరి చేయడం.
- ఉన్నత విద్యా సంస్థల ద్వారా అవగాహన పెంచడం.
- సంప్రదాయ జ్ఞానాన్ని సంరక్షించడం, జీవనోపాధిని సృష్టించడం.
- పరస్పరంగా జ్ఞానాన్ని పంచుకునేందుకు స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడం.
- యువ ఆవిష్కరణల మార్కెట్ను సృష్టించడం.
- పర్యావరణ అనుకూల జీవన ఉపాధి నమూనాలను అభివృద్ధి చేయడం.
- జీవ వైవిధ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం.
- జీవ వైవిధ్య పరిరక్షణపై చట్టపరమైన అవగాహనను పెంచడం.