ఔటర్ ​ప్రజల దాహం తీర్చేలా..శివారులో మినీ వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లు

ఔటర్ ​ప్రజల దాహం తీర్చేలా..శివారులో మినీ వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లు
  • రూ.6.25 కోట్లతో  హిమాయత్ సాగర్, గండిపేట, మంచిరేవులలో నిర్మాణం పూర్తి
  • వీటి నుంచి ఓఆర్ఆర్ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔటర్ రింగ్​ రోడ్​ పరిధిలోని ప్రాంతాలకు సరిపడా తాగునీటిని అందించడంపై వాటర్​బోర్డు ఫోకస్​పెట్టింది. ఓఆర్ఆర్​ను ఆనుకుని ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, గేటెడ్​ కమ్యూనిటీలు, టౌన్​షిప్​లకు నేరుగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటివరకు సరైన పైప్​లైన్ ​వ్యవస్థ లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో జనాలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

వేసవిలో సమస్య తీవ్రమై వేల సంఖ్యలో వాటర్​ ట్యాంకర్లను బుక్ ​చేసుకుంటున్నారు. నీటి సమస్యకు చెక్​పెట్టేందుకు కొత్తగా హిమాయత్ సాగర్, గండిపేట, మంచి రేవులలో వాటర్​బోర్డు ప్రెషర్​ఫిల్టర్లు(మినీ వాటర్​ ట్రీట్​మెంట్​ప్లాంట్లు) ఏర్పాటు చేసింది. 5 ఎంఎల్​డీల కెపాసిటీతో ఒక ప్లాంట్, 3 ఎంఎల్​డీల కెపాసిటీతో రెండు ప్లాంట్లను నిర్మించింది.

రిజర్వాయర్ల నుంచి నేరుగా రా వాటర్​ను ఈ ఫిల్టర్స్​లోకి పంపి శుద్ధి చేస్తారు. తర్వాత పరిసర గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్​షిప్​లకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తారు. ఈ ప్రెషర్​ ఫిల్టర్స్​ తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో నిర్మించారు. మూడు ప్లాంట్లకు కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే ఖర్చయ్యిందని వాటర్ ​బోర్డు అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని అంటున్నారు. 

నీటి సరఫరాపై ప్రభావం పడకుండా.. 

సాధారణంగా ఫిబ్రవరిలోనే నీటికి డిమాండ్​పెరిగి ట్యాంకర్లు బుక్​ చేసుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 3,500 నుంచి 4 వేల ట్యాంకర్లు బుక్​కాగా, ఈసారి 5,500 వరకు బుక్​అవుతున్నాయి.

ఈ లెక్కన మే నెలలో రోజుకు 11 వేల నుంచి 12 వేలకు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఔటర్​ప్రాంతాల్లోనే ఎక్కువ బుకింగ్స్​వస్తుండడంతో నీటి సరఫరాపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు ప్రెషర్​ ఫిల్టర్లను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు.