ఆపరేషన్ మ్యాన్​హోల్స్.. స్పెషల్​ డ్రైవ్​లో 3.5 లక్షల మ్యాన్​హోల్స్​ క్లీనింగ్

ఆపరేషన్ మ్యాన్​హోల్స్.. స్పెషల్​ డ్రైవ్​లో 3.5 లక్షల మ్యాన్​హోల్స్​ క్లీనింగ్

హైదరాబాద్​సిటీ, వెలుగు : సరైన క్లీనింగ్​లేక 20 ఏండ్లుగా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్​బోర్డు పనులు షురూ చేసింది. గ్రేటర్​పరిధిలో చిన్న వాన పడితే చాలు అనేక ప్రాంతాల్లో, మెయిన్​రోడ్లపైన డ్రైనేజీ ఓవర్​ఫ్లో అయి కంపు కొడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైనేజీ పొంగినప్పుడు పై‌‌పైన క్లీన్​చేసి వదిలేస్తున్నారు. ఏండ్లుగా పేరుకుపోయిన సిల్ట్​(పూడిక)ను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా సమస్య మళ్లీ మళ్లీ పునరావృతమవుతోందని వాటర్​బోర్డు గుర్తించింది. ఈ సమస్యకు చెక్​పెట్టేందుకు ప్రస్తుతం నడుస్తున్న 90 రోజుల స్పెషల్​డ్రైవ్​లో ప్రతి మ్యాన్​హోల్​ను క్లీన్​చేయాలని నిర్ణయించింది. 

గ్రేటర్​వ్యాప్తంగా చిన్నచిన్నవి మినహా 4 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు మ్యాన్​హోల్స్​4 లక్షల వరకు, మెయిన్​రోడ్లపై ట్రంక్​మెయిన్లు(15 నుంచి 20 అడుగుల లోతు) 50 వేలకు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా క్లీన్​చేస్తే మరో పదేండ్ల వరకు డ్రైనేజీ ఓవర్​ఫ్లో సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.  

25  స్పెషల్​ టీమ్స్..

90 రోజుల్లో మూడున్నర లక్షల మ్యాన్​హోల్స్​క్లీన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు.రోజుకు 400 మ్యాన్​ హోల్స్ క్లీనింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఇందుకోసం 25 స్పెషల్​టీమ్స్​ను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్​లో ఐదుగురు సిబ్బంది ఉంటారన్నారు. మ్యాన్​హోల్స్​క్లీనింగ్​కోసం 200 ఎయిర్ టెక్ మెషీన్లు వినియోగిస్తున్నారు. పూడిక తీసిన తర్వాత వ్యర్థాలను తరలించడానికి మరో 140 సిల్ట్ క్యారియర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. 20 ఏండ్లలో మహానగరంలో ఈ స్థాయిలో డీ సిల్టింగ్ పనులు చేపట్టడం ఇదే మొదటిసారి. వచ్చే వర్షాకాలం నాటికి గ్రేటర్​ను సీవరేజ్​ఓవర్​ ఫ్లో ఫ్రీ సిటీగా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు 
సాగుతున్నారు.  

సుల్తాన్​బజార్​లో పర్యటించిన ఎండీ

సీవరేజీ డీసిల్టింగ్​పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి సుల్తాన్ బజార్ లో పర్యటించారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు సిల్ట్ కార్టింగ్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, వసతి గృహాలు తదితర యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆ సూచనలు పాటించని పక్షంలో వారికి నోటీసులు జారీ చేయాలన్నారు.