
- 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
- 20 నుంచి 24 వరకు ఈదురుగాలులతో భారీ వర్షాలు
- జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ సిటీలో నాలుగు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 18 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, వికారాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి సహా అన్ని జోన్లలో ఇదే తరహా వాతావరణం ఉండబోతుందన్నారు.
19 వరకు వడగాల్పులు కొనసాగుతాయన్నారు. 20 నుంచి 24వ తేదీ వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్ర ఎండలతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు పగటి పూట బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.