
పద్మారావునగర్, వెలుగు: అఘోరి అలియాస్ శ్రీనివాస్ తన భర్త అని, వాడుకుని వదిలేశాడని కరీంనగర్ కు చెందిన రాధిక అనే మహిళ చెప్పింది. మంగళవారం రాణిగంజ్ బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. శివరుద్ర అనే స్వామీజీతో పాటు అడ్వకేట్ ఆజాద్ తో కలిసి ఫిర్యాదు చేసింది. తనను పెండ్లి చేసుకొని వాడుకొని వదిలేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వర్షిణి అనే మహిళను పెండ్లి చేసుకున్నాడని చెప్పింది. అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పెండ్లి విషయాన్ని బయటకు చెబితే చంపుతానంటూ ఇన్నాళ్లు బెదిరించాడని, డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్పింది. తనలా చాలా మంది బాధితులు ఉన్నారని.. వారు కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని రాధిక కోరింది. కాగా, తాజాగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ను పెండ్లి చేసుకున్న వర్షిణి తండ్రి, ఆమె సోదరుడు కూడా మంగళవారం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్షిణిని మాయమాటలతో నమ్మించి, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.