స్టాక్ మార్కెట్ లో నష్టాలతో యువకుడి ఆత్మహత్య..హైదరాబాద్‌లో ఘటన 

స్టాక్ మార్కెట్ లో నష్టాలతో యువకుడి ఆత్మహత్య..హైదరాబాద్‌లో ఘటన 

మియాపూర్, వెలుగు: స్టాక్ మార్కెట్​లో నష్టాలు రావడం, మహిళా చేతిలో మోసపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చిన్నబావి మండలం పెద్ద దగడ గ్రామానికి చెందిన  భరత్​కుమార్​కుటుంబంతో కలిసి సిటీలోని ఎంఏనగర్​లో నివసిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కుమారుడు గణేశ్(26) లోన్ యాప్, క్రెడిట్ కార్డుల ద్వారా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులను స్టాక్ మార్కెట్ లో పెట్టి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఇదిలా ఉండగానే గణేశ్ గతంలో మెడ్ ల్యాబ్ కంపెనీలో జాబ్ చేసి మానేశాడు.

ఇటీవల ఓ మహిళా మెడ్​ల్యాబ్​ కంపెనీ నుంచి కాల్​ చేస్తున్నామని, కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ లో లక్ష రూపాయల ఫోన్​25 వేలకే అందిస్తున్నామని చెప్పింది. ఇది కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమేనని చెప్పడంతో నమ్మిన గణేశ్​మహిళ చెప్పిన అకౌంట్​కు రూ. 25 వేలను పంపించాడు. ఈ ఆఫర్​ఇంకా కొనసాగుతుందని,  ఫ్రెండ్స్ కు కూడా ఇప్పించడని సదరు మహిళ చెప్పడంతో గణేశ్​9మందితో రూ.25వేల చొప్పున ఫోన్​కోసం డబ్బులు కట్టించాడు.

కొద్ది రోజుల నుంచి ఆ మహిళా స్పందించకపోవడంతో గణేశ్ ను ఫ్రెండ్స్ డబ్బులు అడుగుతూ వచ్చారు. దీంతో గణేశ్ తండ్రి, బంధువులు ఆ డబ్బులను చెల్లించారు. స్టాక్ మార్కెట్ లో నష్టాలు రావడం, మహిళా చేతిలో మోసపోవడంతో గణేశ్​ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే​ ఇంట్లో ఉన్నఫ్యాన్ కు గణేశ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం​ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. మియాపూర్​పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.