నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ.. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు

 నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ.. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్​సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. బడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన ఆ సంస్థ ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సర్వే ద్వారా ఈ నాలాలపై ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది. తర్వాత సర్కారు ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. ఈ సర్వేకు వారం పట్టే అవకాశమున్నట్టు తెలుస్తుండగా, ఇప్పటికే హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సమావేశమైనట్లు తెలిసింది.  

 వర్షాలు కురిసే టైంలో ఈజీ

ఇటీవల హైటెక్​సిటీ పరిధిలో కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు మునిగాయి. కొద్దిరోజుల్లో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో వానలు పడుతున్నప్పుడు హైటెక్​సిటీ పరిధిలో ఉన్న ఆ రెండు నాలాల సమీపంలో ఉన్న ఏయే కాలనీలు మునుగుతున్నాయి..?  కారణాలేమిటి అనేది హైడ్రా తెలుసుకోనుంది. నీళ్లు నిండిన ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి ఆక్రమణలను గుర్తిస్తారు. తర్వాత కూల్చివేతలకు దిగబోతున్నారని తెలుస్తోంది. 

రాంనగర్ తరహాలోనే యాక్షన్ ఉంటుందా..?

వారం క్రితం రాంనగర్‎లోని ఓ నాలాపై బార్​అండ్​రెస్టారెంట్​నిర్వహిస్తున్న రెండు ఫ్లోర్ల  భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే,  ప్రస్తుతం హైడ్రా హైటెక్​సిటీలోని రెండు నాలాలను పైలెట్​ప్రాజెక్టు కింద సర్వే చేస్తుండడంతో ఇతర ప్రాంతాల్లో కూడా నాలాలపై దృష్టి పెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే, రాంనగర్‎లో కమర్షియల్​అవసరాల కోసం ఏర్పాటు చేసిన బార్​అండ్​రెస్టారెంట్‎ను కూల్చివేశారని, పేదలు కట్టుకుని ఉంటున్న ఇండ్ల జోలికి రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎక్కడైనా నాలాలు ఉప్పొంగడం వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరుగుతుందని భావిస్తే వారితో మాట్లాడి వారికి ఇష్టమైతే ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.