
- ఇండ్లల్లో ఉంటున్న వారి జోలికి పోని సిబ్బంది
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ పరికి చెరువులోని ఆక్రమణలను గురువారం హైడ్రా తొలగించింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న రెండు కట్టడాలతోపాటు పునాదుల దశలో ఉన్న మరో రెండు నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పరికి చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేదని, లోకల్లీడర్ఒకరు ప్రభుత్వ భూమితోపాటు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిని ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మేస్తున్నారని పరికి చెరువు పరిరక్షణ సమితి హైడ్రాకు ఫిర్యాదు చేసింది.
విచారించిన హైడ్రా అధికారులు నిజమేనని తేల్చారు. అక్రమ నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. 50 గజాల స్థలాన్ని రూ.15 లక్షలకు కొన్నామని, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తోందని తెలియక కొని మోసపోయామని బాధితులు వాపోయారు. ఇప్పటికే ఇండ్లలో ఉంటున్న వారివి కాకుండా నిర్మాణ దశలో ఉన్నవాటినే హైడ్రా కూల్చివేసింది.