
బెంగళూరు: పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై యుద్ధం వద్దని తాను అనలేదని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. అనివార్యమైతేనే యుద్ధం జగాలని, ఈ సమస్యకు అది పరిష్కార మార్గం కాదని తాను అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ‘పాకిస్తాన్తో యుద్ధం వద్దు’ అంటూ సిద్ధ రామయ్య ఇటీవల చేసిన కామెంట్స్పాకిస్తాన్ మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో ఆయనపై బీజేపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధ రామయ్య తన వ్యాఖ్యలపై ఆదివారం మీడియా ఎదుట వివరణ ఇచ్చారు.
ఈ వీడియోను ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ‘‘ఇప్పుడు యుద్ధం అవసరం లేదు అంటే.. అనివార్యమైతేనే జరగాలి. యుద్ధం ఒక్కటే పరిష్కార మార్గం కాదు. యుద్ధం కోసం వచ్చిన డిమాండ్లను నేను తప్పుపట్టలేదు” అని అన్నారు. అవసరమైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధిచెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
నిఘా వైఫల్యం వల్లే ఉగ్రదాడి
పహల్గాం వద్ద పర్యాటకులకు భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ విధి అని సిద్ధ రామయ్య అన్నారు. ఈ విషయంలో లోపాలు జరిగాయని, ఈ దాడిని నివారించడంలో నిఘా విభాగం విఫలమైందని తెలిపారు.
సిద్ధ రామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
పాక్తో యుద్ధాన్ని భారత్లోనే కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు అక్కడి మీడియాలో ప్రసారం కాగా.. బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. సరిహద్దులో యుద్ధ ముప్పు పొంచి ఉన్న సమయంలో.. సిద్ధరామయ్య శత్రు దేశానికి కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని కర్నాటక శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్.అశోక ఫైర్ అయ్యారు. పాక్ సర్కారు సిద్ధరామయ్యకు అత్యున్నత పౌరపురస్కారం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.