
- రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
- జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి
- విద్యుత్ శాఖ సెక్రటరీగా రొనాల్డ్ రోస్.. హెచ్ఎండీఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్
- కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ
- యూత్ సర్వీసెస్, టూరిజం, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్
- చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఒకేసారి 43 మంది ఆలిండియా సర్వీసు అధికారులు, ఒక నాన్ క్యాడర్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్లలో చాలా విభాగాల హెచ్వోడీలు మారారు. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టేలా ఈ బదిలీలు చేసినట్లు స్పష్టమవుతున్నది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు.
సందీప్ సుల్తానియా పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీగాను కొనసాగనున్నారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ను ప్రభుత్వం నియమించింది.
చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ను నియమించడంతో పాటు.. హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్క్రాఫ్ట్స్ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను నియమించడంతో పాటు టీపీటీఆర్ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జీఏడీ కార్యదర్శి(జీఎం, హెచ్ఆర్ఎం)గా సుదర్శన్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
యంగ్ ఐఏఎస్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. హెచ్ఎండీఏ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న దానకిషోర్ స్థానంలో ఎన్నికల విభాగంలో జాయింట్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ను హెచ్ఎండీఏ కమిషనర్గా నియమించారు. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీని.. కమర్షియల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
10 రోజుల కిందటే 20 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద ఎత్తున ఐఏఎస్లను బదిలీ చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పమేలా సత్పతిని ఇటీవల బదిలీల్లో మార్చి జీఏడీకి అటాచ్ చేయగా.. ఇప్పుడు తాజాగా మళ్లీ కరీంనగర్ కలెక్టర్గా ఆమెనే నియమించారు. హార్టికల్చర్ కమిషనర్గా ఉన్న అశోక్ రెడ్డిని హెచ్ఎండబ్ల్యూఎస్ ఎం.డీగా ప్రభుత్వం నియమించింది. సమర్థవంతమైన అధికారిగా అశోక్ రెడ్డికి పేరుంది.
త్వరలో వికాస్రాజ్, లోకేశ్ కుమార్కు పోస్టులు!
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్, అడిషనల్ సీఈఓగా ఉన్న లోకేశ్ కుమార్ను ప్రభుత్వంలోకి తీసుకోనున్నారు. వీరిద్దరికి కీలక పోస్టులు ఇస్తారనే చర్చ జరుగుతున్నది. లోకేశ్కుమార్ను సీఎంవోలోకి తీసుకునే అవకాశం ఉంది. వికాస్ రాజ్కు కూడా ప్రాధాన్యత గల పోస్టు ఇస్తారని సమాచారం. త్వరలోనే మరో నలుగురైదుగురు సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్లు ఉంటాయని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.
ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా రామకృష్ణారావు ఉన్నారు. ఆయన ఉండగానే ప్రభుత్వం సందీప్ కుమార్ సుల్తానియాకు ఫైనాన్స్ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. దీంతో బడ్జెట్ సమావేశాల తరువాత రామకృష్ణారావును మారుస్తారనే చర్చ జరుగుతోంది.