
శ్రీనగర్: కాశ్మీర్లో పెను ప్రమాదం తప్పింది. శ్రీనగర్, బారాముల్లా హైవేపై భద్రతా బలగాలు సోమవారం అనుమానిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని గుర్తించి నిర్వీర్యం చేశాయి. బారాముల్లా జిల్లాలోని పట్టన్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పల్హల్లాన్ వద్ద హైవే పక్కన అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీచేయించగా.. ఆ వస్తువు ఐఈడీగా గుర్తించారు.
వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైవేపై ట్రాఫిక్ను నిలిపివేశారు. బాంబు స్క్వాడ్ దానిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి కొన్ని గంటల పాటు శ్రమించి నిర్వీర్యం చేసింది. ఆ తర్వాత ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.