
హైదరాబాద్, వెలుగు : నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సంక్షేమం కోసం కృషి చేస్తా’ అని కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ క్యాండిడేట్ మల్క కొమురయ్య చెప్పారు. ప్రైవేట్ టీచర్లు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు, లెక్చరర్లతో శుక్రవారం హైదరాబాద్లో మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పని చేసే టీచర్లు జీవిత బీమా, హెల్త్ కార్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్న ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులు మెటర్నటీ లీవ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, లెక్చరర్లు చాలా కాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
తనకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, ట్యూషన్ ఫీజులను చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నారు.