ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఫా’ (ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుకలు యూఏఈ రాజధాని అబుదాబిలో ఘనంగా జరిగాయి. బాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాకు చెందిన పలువురు సినీ సెలెబ్రిటీస్ ఈ వేడుకలో సందడి చేశారు. ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారాన్ని చిరంజీవి, గోల్డెన్ లెగసీ’ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు.
ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సమంత అందుకుంది. ‘ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డును ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్, ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి, ‘ఎక్సలెన్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా’ అవార్డును కీర్తి సురేష్ అందుకున్నారు.
ఉత్తమ చిత్రంగా దసరా
తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ‘దసరా’ చిత్రం ఐఫా వేడుకలో కీలక అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా ‘దసరా’ నిలవగా, ఈ చిత్రానికి గాను తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్గా నాని అవార్డును అందుకున్నారు. తమిళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘జైలర్’ నిలవగా, ఉత్తమ నటుడిగా విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్-2)కు అవార్డును స్వీకరించారు.
కన్నడ నుంచి రక్షిత్ శెట్టి (సప్త సాగరదచ్చే ఎల్లో), మలయాళం నుంచి టొవినో థామస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో) అవార్డులను గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకులుగా తమిళం నుంచి మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్-2), తెలుగు నుంచి అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి), కన్నడ నుంచి తరుణ్ కిశోర్ సుధీర్ (కాటేరా), మలయాళం నుంచి జియో బేబీ (కాదల్: ద కోర్) అవార్డులు అందుకున్నారు.
బెస్ట్ యాక్ట్రెస్గా ఐశ్వర్యరాయ్, మృణాల్
ఇక ఉత్తమ నటి కేటగిరీలో తెలుగు నుంచి మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న), తమిళం నుంచి ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్-2), కన్నడ నుంచి రుక్మిణి వసంత్ (సప్త సాగరదచ్చే ఎల్లో), మలయాళం నుంచి అనస్వర రాజన్ (నేరు) అవార్డులను స్వీకరించారు. విలన్స్గా కన్నడ చిత్రానికి జగపతిబాబు (కన్నడ), ‘దసరా’కు మలయాళ నటుడు షైన్ టామ్, మార్క్ ఆంటోనీ చిత్రానికి ఎస్.జె.సూర్య, అర్జున్ రాధాకృష్ణ్ (మలయాళం) ఐఫా అవార్డులను అందుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో తమిళం నుంచి ఎ.ఆర్.రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2), తెలుగు నుంచి హేషమ్ అబ్దుల్ వహబ్ (హాయ్ నాన్న), తెలుగు లిరిసిస్ట్గా అనంత శ్రీరామ్ (బేబీలో ఓ రెండు మేఘాలిలా), ప్లే బ్యాక్ సింగర్స్గా రాహుల్ సిప్లిగంజ్ (మేం ఫేమస్), మంగ్లీ (బలగం) అవార్డులను అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలో బ్రహ్మానందం (రంగమార్తాండ), జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2), వరలక్ష్మీ శరత్ కుమార్ (వీర సింహారెడ్డి) అవార్డులను అందుకున్నారు.