నందగిరి హిల్స్ లో కొండను తవ్వి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు

నందగిరి హిల్స్ లో  కొండను తవ్వి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో కొందరు  కమర్షియల్ దందాకు తెరలేపారు. హెచ్ఎండీఏ వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని కొన్న వ్యక్తి దానికి ఆనుకొని ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని 865.42 గజాల జాగా కొని ‘నెట్​నెట్​వెంచర్స్’ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. నందగిరి హిల్స్​లో ఉన్న భూమిని, జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీలో ఉన్నట్లు చూపించి అనుమతులు తెచ్చుకోవడం, జీహెచ్ఎంసీ అధికారులు రూల్స్​కు విరుద్ధంగా బిల్డింగ్​కు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతున్నది.  

కొండను తవ్వి.. కమర్షియల్​ కాంప్లెక్స్ 

ఏకంగా కొండను తవ్వి కమర్షియల్ ​కాంప్లెక్స్​కడుతున్నారని హౌసింగ్​ సొసైటీ మెంబర్​ రాఘవాచారి పేర్కొన్నారు.  ‘‘2012 లో పబ్లిక్ యాక్షన్​ ద్వారా హెచ్ఎండీఏ నందగిరి హిల్స్​​లో 4.74 ఎకరాలను అమ్మకానికి పెట్టింది.  నెట్​నెట్ ​వెంచర్స్ సంస్థ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీకి అప్లై చేయగా 2013 లో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం అనుమతులు వచ్చాయి. అప్పుడున్న నిబంధనల ప్రకారం జీ +4 (5 నుంచి7 సెల్లార్ల వరకు) నిర్మించుకునేలా అనుమతించింది. 2015 నుంచి అనధికారికంగా ఈ కొండను తవ్వడం మొదలుపెట్టారు. 100 మీటర్ల లోతుకు కొండను తవ్వారు. దీనిపై స్థానికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే, నెట్​నెట్ ​వెంచర్స్​సంస్థకు రూ.23 కోట్లు పెనాల్టీ విధించింది’ అని వెల్లడించారు. తర్వాత దానికి అనుకుని ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్​సొసైటీకి చెందిన 865 చదరపు గజాల స్థలాన్ని ప్రైవేట్​ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని రాఘవాచారి చెప్పారు. ఈ ప్లాట్ ఫేస్ జూబ్లీహిల్స్ రోడ్​నెంబర్​45 వైపు ఉందని, దీంతో రెండింటిని కలిపేసి కమర్షియల్ కట్టడాలకు తెరలేపారని అన్నారు. 

‘‘ప్రస్తుతం ఈ 4.7 ఎకరాల్లో 147 మీటర్ల ఎత్తులో నెట్ నెట్ వెంచర్స్ సంస్థ మెగా కమర్షియల్ కాంప్లెక్స్  కడుతున్నది. కేబీఆర్ పార్కు పక్కన ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ బల్దియా కమిషనర్ కు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్​కు  ఫిర్యాదు చేస్తే పరిశీలించి అక్రమమని తేల్చింది. జూబ్లీహిల్స్ ప్లాట్ పేరుతో నందగిరి ప్లాట్ లో నిర్మాణం చేపడుతున్నారని చెప్పింది. లక్షా 50 వేల స్క్వేర్ మీటర్లు దాటిన బిల్డింగ్స్ కి ఎన్విరాన్​మెంటల్​పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని, పబ్లిక్​ హియరింగ్ కూడా లేకుండా పాత అప్రూవల్ చూపించి నిర్మాణం చేపట్టిందని చెప్పింది.  దీంతో విజిలెన్స్ అధికారుల రిపోర్టును అమలు చేయాలని సొసైటీ మెంబర్స్​హైకోర్టును ఆశ్రయించారు. దీంతో  కోర్టు మున్సిపల్ అధికారులకు నోటీసులిచ్చి వివరణ ఇవ్వాలని అడిగింది. అయినా, ఇప్పటికీ పనులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి” అని పేర్కొన్నారు. కాగా, దీనిపై త్వరలోనే హైడ్రాకు కంప్లయింట్ చేయబోతున్నామని సొసైటీ సభ్యులు తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా వెళ్తామని అంటున్నారు.

 ఒక్కో ఏడాది ఒక్కోతరహా బిల్డింగ్ ​పర్మిషన్ 

కమర్షియల్ ​కాంప్లెక్స్​ నిర్మాణం కోసం నందగిరి హిల్స్ పరిధిలోని హెచ్ఎండీఏ కు సంబంధించిన 4.74 ఎకరాల భూమిని జూబ్లీహిల్స్​ రోడ్​ నెం.45లో ఉన్న లే అవుట్​లోని 865.42 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్​ను ఒకే స్థలంగా చూపి నెట్ నెట్ సంస్థ అనుమతులు తెచ్చుకున్నది. జూబ్లీహిల్స్ లేఅవుట్​కు వర్తించే జీవో ఎంఎస్ ​నంబర్​305 ను నందగిరి హిల్స్​లోని 4.74 ఎకరాల స్థలానికి వర్తింపజేసింది. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సహకరించారు. 2017 డిసెంబర్​7న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్​​305 ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలను అనుమతిస్తారు. 

ఇంపాక్ట్  ఫీజు కడితే మరికొన్ని అంతస్తులు కట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్​రోడ్ నెం. 45 వైపు 30 మీటర్ల అనుమతి మాత్రమే ఉండడంతో ఇంపాక్ట్​ ఫీజు చెల్లించి, ముందు 45 మీటర్లకు సదరు సంస్థ అనుమతి తెచ్చుకున్నది. కానీ, నందగిరి హిల్స్, హెచ్ఎండీఏ నుంచి కొన్న ప్లాట్​లో15 మీటర్లకే అనుమతి ఉంది. ఇక్కడే తమ తెలివితేటలు ప్రయోగించారు. జూబ్లీహిల్స్​ప్లాట్​నుంచి దారి చూపిస్తూ నందగిరి హిల్స్​లోనూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తెచ్చుకున్నారు. అలా.. 2013లో జీ+4 ఫ్లోర్లు​.. 5 నుంచి 7 సెల్లార్లు, 2021లో జీ+5 ఫ్లోర్లు​.. 7 స్టిల్ట్​ ఫ్లోర్స్, 2022లో జీ+12 ఫ్లోర్లు​.. 7 స్టిల్ట్​ ఫ్లోర్లు, 2023లో జీ+13 ఫ్లోర్లు.. 5 స్టిల్ట్​ ఫ్లోర్లు​, ఒక సెల్లార్​కు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 50 మీటర్ల ఎత్తుకు అనుమతి కోసం అప్లై చేసుకోగా.. అది పెండింగ్​లో ఉంది. ఈ బిల్డింగ్ లో షాపింగ్​మాల్స్, స్టార్​ హోటల్స్​నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాంతంలో పర్యావరణ నిబంధనల ప్రకారం అలాంటి నిర్మాణలకు అనుమతి లేదు.