తెలంగాణ టు కర్నాటక .. అక్రమంగా తరలిపోతున్న వడ్లు, పీడీఎస్​ బియ్యం

 తెలంగాణ టు కర్నాటక .. అక్రమంగా తరలిపోతున్న వడ్లు, పీడీఎస్​ బియ్యం
  • గ్యాంగులను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు
  • బియ్యం, వడ్లు సేకరించి లారీల్లో రవాణా

మహబూబ్​నగర్, వెలుగు: తెలంగాణ వడ్లు, పీడీఎస్​ బియ్యాన్ని కర్నాటకకు చెందిన వ్యాపారులు తరలించుకుపోతున్నారు. అక్కడ వీటికి డిమాండ్ ఉండడంతో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకుంది. వారి ద్వారా పెద్ద మొత్తంలో రైతుల నుంచి వడ్లు, పేదల నుంచి పీడీఎస్​ బియ్యం సేకరించి లారీల్లో కర్నాటకకు తరలిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి తెలంగాణ–-కర్నాటక బార్డర్​లోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని టై రోడ్డు వద్ద ఉన్న చెక్​పోస్ట్  దగ్గర ఎన్స్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు ముందస్తు సమాచారంతో ఆరు లారీల వడ్లు, ఒక లారీ  పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు.

గ్యాంగుల ద్వారా సేకరణ..

వడ్లు, పీడీఎస్​ బియ్యం సేకరించేందుకు కర్నాటకకు చెందిన వ్యాపారులు కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుకుబడి ఉన్న పొలిటికల్​ లీడర్లతో చేతులు కలుపుతున్నారు. పొలిటికల్​ లీడర్లకు నమ్మకస్తులుగా ఉన్న వారిని కలుపుకొని గ్యాంగ్​గా ఏర్పాటు చేస్తున్నారు. వీరి ద్వారా గ్రామాల్లో రైతులు, రేషన్​ లబ్ధిదారులను కలుస్తున్నారు. వారికి కొంత డబ్బు ముట్టజెప్పి.. స్టాక్​ను ట్రాలీ ఆటోల్లో లోడ్​ చేసుకొని.. తెలిసిన వారి పొలాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రిళ్లు ఆ డంపులను డీసీఎంలు, లారీల్లో ఎక్కించి కర్నాటకకు తరలిస్తున్నారు.

 దీనిపై కొంత కాలంగా స్టేట్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లకు కంప్లైంట్లు పోతున్నాయి. ఈ క్రమంలో వారు తెలంగాణ, -కర్నాటక, ఏపీ బార్డర్ల వద్ద నిఘా పెంచారు. సోమవారం రాత్రి ఈ జిల్లాల నుంచి సేకరించిన వడ్లు, పీడీఎస్​ బియ్యాన్ని ఏడు లారీల్లోకి ఎక్కించి నారాయణపేట జిల్లా మీదుగా బార్డర్​ దాటిస్తుండగా.. ముందస్తు సమాచారంతో హైదరాబాద్​ నుంచి వచ్చిన స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఈ లారీల్లో 3,500 బస్తాల వడ్లు ఉన్నాయి. ఈ బస్తాలన్నీ 40 కిలోల చొప్పున ఉన్నాయి. అయితే బ్యాగులు ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మచ్చుకు మరికొన్ని ఘటనలు..
    

  • మహబూబ్​నగర్​లోని స్టేట్​ వేర్​ హౌసింగ్​ గోదాముల్లో కొద్ది రోజుల కింద సివిల్​ సప్లైకు చెందిన రూ.2.50 కోట్లు విలువ చేసే బియ్యం మాయమయ్యాయి. సివిల్​ సప్లై ఆఫీసర్లు ఈ గోదాములో తనిఖీలు​చేయగా, 680 మెట్రిక్​ టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ డిపార్ట్​మెంట్​ కమిషనర్​కు కంప్లైంట్​ చేశారు. కానీ, పాలమూరుకు చెందిన ఓ పొలిటికల్​ లీడర్​ జోక్యం చేసుకొని అక్రమార్కులను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  
  • మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం శివారులో కొద్ది రోజుల కింద లారీ, డీసీఎంలో తరలిస్తున్న 70 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నా.. తక్కువ మొత్తం చూపించారనే ఆరోపణలు వచ్చాయి.    
  • గత నెల నారాయణపేటలో అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చుట్టుపక్కల ఇండ్ల నుంచి రేషన్  బియ్యం సేకరించి సుభాష్​రోడ్ లోని ఓ రేకుల షెడ్డులో నిల్వ చేస్తుండగా, టాస్క్ ఫోర్స్, నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్​ చేసి కేసు నమోదు చేశారు.
  • మరికల్ పోలీస్ స్టేషన్  పరిధిలోని తీలేరు గ్రామంలో గత నెల నలుగురు ఇండ్లల్లో సోదాలు చేసి 42 క్వింటాళ్ల రేషన్  బియ్యం పట్టుకొని కేసులు నమోదు చేశారు. గండీడ్, మహ్మదాబాద్, ఊట్కూరు మండలం సమిస్తాపూర్​ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని ఆఫీసర్లు దాడులు చేసి పట్టుకున్నారు.